బీజింగ్: షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సిఓ) సభ్య దేశాల మధ్య సోమవారం జరిగిన వీడియో సమావేశంలో అనేక అంశాలకు సంబంధించి ఏకాభిప్రాయం సాధించడంపై సానుకూల సంకేతాలు అందాయని చైనా తెలిపింది. సోమవారం భారత్ నిర్వహించిన ఈ సమావేశంలో భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు కూడా ప్రసంగించారు. చైనా ప్రధాని లీ కెక్వియాంగ్తోసహా ఎనిమిది దేశాలకు చెందిన అధినేతలు పాల్గొన్నారు.
కొవిడ్-19పై పోరాటానికి తీసుకోవలసిన చర్యలతోసహా వాణిజ్య, పెట్టుబడులు, సాంస్కృతిక రంగాలకు చెందిన అంశాలపై కుదరిన ఏకాభిప్రాయాన్ని అమలుచేయడంపై చర్చించినట్లు చైనా విదేశాంగ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ మంగళవారం తెలిపారు. అనేక అంశాలపై ఏకాభిప్రాయం కుదిరిందని, అనేక ఒప్పందాలను ఖరారుచేస్తూ ఎస్సిఓ నాయకులు ఉమ్మడి ప్రకటన విడుదల చేశారని ఆయన చెప్పారు. ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించడానికి ఉమ్మడి కార్యాచరణ కొనసాగించాలని కూడా సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ఆర్థిక, భద్రతాంశాలకు చెందిన ఎస్సిఓలు భారత్, పాకిస్తాన్ శాశ్వత సభ్యత్వాలను 2017లో పొందాయి. ఈ సంస్థ వ్యవస్థాపక సభ్యులలో చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఉన్నాయి.