మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (పిఎంజిఎస్వై ) పథకం కింద నిర్మిస్తున్న రోడ్ల పనులను శరవేరంగా పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. నాణ్యత ప్రమాణాలతో, నిర్ణితకాలంలో ఆయా పనులు పూర్తి అయ్యేలా యుద్ధ ప్రాతిపదికిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ పథకం కింద కేంద్రం నుంచి 158 రోడ్లు మంజూరు అయ్యాయన్నారు. ఆయా రోడ్ల పరిస్థితి, వాటి పురోగతిపై మంత్రి కూలంకషంగా చర్చించారు. హైదరాబాద్లోని రంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో గల పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆఫీసులోని తన చాంబర్లో మంత్రి ఎర్రబెల్లి సంబంధిత అధికారులతో సమీక్షా, సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద మన రాష్ట్రానికి మంజూరైన దాదాపు 158 రోడ్ల పనుల ప్రగతి మీద ఒక్కో అంశం వారిగా అధికారులతో సుధీర్ఘంగా మంత్రి ఎర్రబెల్లి చర్చించారు. ఆయా పనులను సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల్లో ఏమైనా అడ్డంకులు వెంటే ఆ సమస్యను వెంటనే తన దృష్టికి తీసుకరావాల్సిందిగా అధికారులకు ఆయన సూచించారు. నిబంధనలకు లోబడి ఉన్న పనులను మొదటి ప్రాధాన్యతగా, ఇబ్బందులున్న పనులను సమస్యలను వెంటవెంట పరిష్కరిస్తూ వాటిని కూడా రెండో ప్రాధాన్యాంశాలుగా తీసుకుని పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ఆయా పనులను అధికారులు స్వయంగా పర్యవేక్షించాలని మంత్రి సూచించారు. ఈ సమీక్షా సమవేశంలో సంబంధిత శాఖల ఇఎన్సిలు, సిఇలు, డిఇఇలు, ఎఇలు తదితర అధికారులు పాల్గొన్నారు.