వివాదాస్పదంగా కొత్తగూడెం డిఎస్పి డిశ్చార్జ్
మళ్లీ ఆసుపత్రికి పోలీస్ అధికారి
మొదటిసారి నెగిటివ్, రెండోసారి పాజిటివ్
అప్పటికే కొత్తగూడెం వెళ్లిపోయిన డిఎస్పి
మళ్లీ తిరిగి హైదరాబాద్ చెస్ట్ ఆస్పత్రికి రప్పించిన అధికారులు
మనతెలంగాణ/హైదరాబాద్/ కొత్తగూడెం : కరోనా వైరస్తో చికిత్స పొంది ఇంటికి వచ్చిన కొత్తగూడెం డిఎస్పీ షేక్అలీని వైద్యాధికారులు శుక్రవారం మరోసారి హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. చెస్ట్ ఆస్పత్రిలో కరోనా పాజిటివ్తో చికిత్స పొందుతున్న ఎస్ఎం అలీని డిశ్చార్జి చేయాల్సి ఉండగా, డిఎస్పీ షేక్ అలీని చెస్ట్ ఆస్పత్రి అధికారులు డిశ్చార్జ్ చేశారు. అయితే డిశ్చార్జ్ నోట్లో మాత్రం షేక్ అలీ అన్న పేరు రాశారు. ఆయన ఇంటి అడ్రస్ కొత్తగూడెం డిఎస్పీ ఆఫీసు అని డిశ్చార్జ్ నోట్లో స్పష్టంగా రాశారు. గురువారం డిశ్చార్జ్ కాగానే డిఎస్పీ షేక్అలీ కొత్తగూడెం వెళ్లిపోయారు.
అనంతరం గురువారం రాత్రి వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన రెండు యాక్టివ్ కేసుల ఉన్నట్లు ప్రకటన విడుదల చేశారు. జరిగిన పొరపాటును శుక్రవారం ఉదయం చెస్ట్ ఆస్పత్రి అధికారులు గుర్తించి కొత్తగూడెం నుంచి డిఎస్పీ షేక్అలీని హైదరాబాద్లోని చెస్ట్ ఆస్పత్రికి తరలించారు. కొత్తగూడెం డిఎస్పీ షేక్అలీని డిశ్చార్జ్ చేసే ముందు చేసిన రెండు టెస్టుల్లో మొదటిది నెగిటివ్గా వచ్చిందని, రెండో టెస్టు రిజల్ట్ శుక్రవారం పాజిటివ్ అని తేలిందని సూపరింటెండెంట్ పేర్కొన్నారు. దీంతో డిఎస్పీని మళ్లీ శుక్రవారం ఆస్పత్రికి తీసుకొచ్చినట్టు ఆయన తెలిపారు. డిఎస్పీతో పాటు మరో ఇద్దరూ క్వారంటైన్కు తరలించామన్నారు.