హుయాజోంగ్ యూనివర్శిటీ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి
బీజింగ్ : కరోనావైరస్ బాధితులైన గర్భిణుల నుంచి వారి బిడ్డలకు కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉండబోదని హుయాజోంగ్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. సోమవారం వెలుగు లోకి వచ్చిన ఈ అధ్యయనం .జర్నల్ ఫ్రాంటియర్స్ ఇన్ పెడియాట్రిక్స్ లో ప్రచురించారు. వుహాన్ యూనియన్ ఆస్పత్రిలో కరోనా సోకిన నలుగురు గర్భిణులు ప్రసవించగా వారిపై అధ్యయనం చేశారు. వీరు ప్రసవించిన బిడ్డలు ఎవరికీ కరోనా వైరస్కు సంబంధించిన సీరియస్ లక్షణాలు ఏవీ కనిపించలేదు. వీరిని పుట్టగానే నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో ఐసొలేటెడ్గా ఉంచి కూడా పరిశీలించారు.
ఈ నలుగురి బిడ్డల్లో ముగ్గురి శ్వాస ప్రక్రియ పరిశీలించగా నెగిటివ్ కనిపించింది. నాలుగో బిడ్డను పరీక్షించడానికి ఆబిడ్డ తల్లి ఒప్పుకోలేదు. కొత్తగా పుట్టిన బిడ్డ ఒకరు శ్వాసకు సంబంధించిన స్వల్ప ఇబ్బందిని ఎదుర్కోగా చికిత్స ద్వారా వెంటనే నయం చేశారు. ఇద్దరు బిడ్డల్లో ఒకరికి శ్వాస ఇబ్బంది కనిపించినా ఆ తరువాత సర్దుకుంది. ఇప్పుడు నలుగురు బిడ్డలు క్షేమంగా ఉన్నారని వారి తల్లులు కూడా కోలుకుంటున్నారని పరిశోధకులు యలాన్ లియు చెప్పారు. ఇంతకు ముందు అధ్యయనంలో కరోనా వైరస్ సోకిన తొమ్మిది మంది గర్భిణులను అధ్యయనం చేయగా వారి బిడ్డలకు కరోనా సోకినట్టు ఎక్కడా కనిపించలేదని పరిశోధకులు వివరించారు.