ముంబయి: కరోనా ప్రభావం కారణంగా రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతున్నాయి. దీంతో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు వేతనాల్లో కోత పెట్టిన విషయం తెలసిందే. తాజాగా అదే బాటలో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా నడిచింది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సహా ప్రజా ప్రతినిధుల వేతనాల్లో కోత విధిస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. మార్చి నెల వేతనంలో 60 శాతం కోత విధిస్తున్నట్టు డిప్యూటీ సిఎం, ఆర్థికమంత్రి అజిత్ పవార్ వెల్లడించారు. మంగళవారంనాడిక్కడ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. క్లాస్ 1,2 ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50శాతం, క్లాస్ 3 ఉద్యోగుల వేతనాల్లో 25శాతం కోత విధిస్తున్నట్టు ప్రకటించారు. క్లాస్ 4 ఉద్యోగులకు పూర్తి జీతం ఇవ్వనున్నట్టు చెప్పారు. కరోనా మహమ్మారిని సమర్థవంతంగా అడ్డుకోవడానికి భారీ ఎత్తున నిధులు సమకూర్చడంతో పాటు, లాక్డౌన్ కారణంగా ప్రభుత్వానికి రావాల్సిన నిధులు రాకపోడంతో వేతనాలు కోత పెట్టాల్సి వచ్చిందన్నారు. ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు పరిస్థితిని అర్థం చేసుకుని ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్రలో బాటలోనే పయనించేందుకు మిగతా రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి.
Corona Effect: Maharashtra Employees Salary cut