ఒక్కో కరోనా చికిత్స కేంద్రంలో 250 చొప్పున…
హైదరాబాద్ సహా చుట్టు పక్కల జిల్లాల్లో 50వేల పరీక్షల్లో ఇప్పటికే 40వేలు పూర్తి
రాబోయే రోజుల్లో టెస్టుల సామర్థం మరింత పెంచుతాం : వైద్య ఆరోగ్య శాఖ
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా ఉచిత పరీక్షలు మళ్లీ ప్రారంభం అయ్యాయి. మూడు రోజుల తర్వాత శాంపిల్స్ సేకరణ షురూ అయింది. సోమవారం సరోజనీ దేవి, చార్మినార్ నిజామియా, నేచర్క్యూర్, ఆయుర్వేదిక్ హాస్పిటల్స్లో ఒక్కో కేంద్రం నుంచి 250 శాంపిల్స్ తీసుకోగా, రంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్ ఏరియా ఆసుపత్రి, బాలాపూర్ యూపిహెచ్సి, మహేశ్వరం సిహెచ్ సిలలో ఒక్కో కేంద్రం నుంచి 150 శాంపిల్స్ చొప్పున సేకరించినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అంచనా వేసేందుకు జిహెచ్ఎంసి పరిధితో పాటు చుట్టు పక్కల జిల్లాల్లో ర్యాండమ్గా 50వేల టెస్టులు చేయాలని సిఎం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా ఈనెల 16 నుంచి తొమ్మిది రోజుల పాటు సుమారు 36వేల నమునాలు సేకరించారు.
అయితే ల్యాబ్లలో 24 గంటలు పనిచేసినా ఆ మొత్తానికి నిర్ధారణ జరగలేదు. దీంతో ల్యాబ్లలో నమూనాలు నిండిపోవడంతో తాత్కాలికంగా శాంపిల్ సేకరణ కార్యక్రమాన్ని అధికారులు మూడు రోజుల పాటు నిలిపివేశారు. పెండింగ్లో ఉన్న 8253 శాంపిల్స్ నిర్ధారణ కావడంతో తిరిగి నమూనాలు సేకరిస్తున్నామని అధికారులు తెలిపారు. అయితే ప్రభుత్వం చెప్పిన 50వేల పరీక్షల నిర్వహణలో భాగంగా ఇప్పటికే దాదాపు 40వేల శాంపిల్స్ సేకరించామని, దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 85106 పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు స్పష్టం చేశారు.
మరోవైపు రాష్ట్రంలో టెస్టులు సంఖ్య పెరగడంతోనే కేసులు పెరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర వ్యాప్తం గా ప్రభుత్వం ఆధీనంలో పది ల్యాబ్లు,16 ప్రైవేట్ ల్యాబ్లలో కరోనా టెస్టులు జరుగుతున్నాయి. ప్రతి రోజూ ప్రభుత్వ ల్యాబ్ల కెపాసిటీ సుమారు 2200 ఉండగా, ప్రైవేట్ ల్యాబ్లలో సుమారు మరో 2500 మందికి టెస్టులు చేసే సామర్థం ఉందని ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో టెస్టుల సామర్ధాన్ని కూడా పెంచుతామని వైద్యారోగ్యశాఖ తెలిపింది.