Friday, April 19, 2024

భారత్‌లో 6 నెలల్లో ఎండెమిక్ దశ లోకి కరోనా

- Advertisement -
- Advertisement -

Corona into endemic phase in 6 months in India

న్యూఢిల్లీ : దేశంలో రానున్న రోజుల్లో స్థానికంగా ఎప్పటికీ ఉండిపోయే (ఎండెమిక్) దశ లోకి కరోనా మారే సూచనలు కనిపిస్తున్నాయి. రానున్న ఆరు నెలల్లోనే కొవిడ్ 19 ఎండెమిక్‌గా మారే అవకాశాలు ఉన్నట్టు ప్రజారోగ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా కేవలం కొత్త వేరియంట్లు వెలుగు చూసినంత మాత్రాన అవి థర్డ్ వేవ్‌కు కారణమౌతాయని కచ్చితంగా చెప్పలేమని చెబుతున్నారు. కరోనా మన అంచనాలకు అందని విధంగా విజృంభించిందని, ముఖ్యంగా మరణాల సంఖ్య సంక్రమణ రేటు నియంత్రణలో ఉన్నట్టయితే వ్యాధిని కట్టడి చేసుకోవచ్చునని జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం (ఎన్‌సిడిసి) డైరెక్టర్ సుజీత్ సింగ్ పేర్కొన్నారు. కరోనాను ఎదుర్కోవడంలో వ్యాక్సినేషన్ అత్యంత కీలకమని సుజీత్ సింగ్ స్పష్టం చేశారు.

వ్యాక్సిన్ సమర్థత 70 శాతంగా ఉన్నట్టయితే ఇప్పటికే దేశంలో దాదాపు 50 కోట్ల మందికి ఇమ్యూనిటీ వచ్చినట్టేనని అభిప్రాయ పడ్డారు. ముఖ్యంగా వ్యాక్సిన్ పొందిన వారికి కూడా (బ్రేక్ త్రూ ) ఇన్‌ఫెక్షన్ సోకే ప్రమాదం 20 నుంచి 30 శాతం ఉన్నందున అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కొత్త వేరియంట్ల కారణంగా బ్రేక్‌త్రూ వచ్చే అవకాశం ఉందని, వీటితో పాటు వ్యాక్సినేషన్ వల్ల కలిగే రోగ నిరోధక శక్తి 70 నుంచి 100 రోజుల తరువాత క్రమంగా క్షీణిస్తుందని నిపుణులు చెబుతున్న విషయాన్ని సుజీత్ సింగ్ గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం దేశంలో కొత్త వేరియంట్లు ముఖ్యంగా ము, సి.1.2 వేరియంట్ల ప్రభావం ఇప్పటివరకు దేశంలో లేదని స్పష్టం చేశారు.

భారత్‌లో ఓ మోస్తరు స్థాయిలో ఎప్పటికీ ఉండిపోయే వ్యాధి దశ లోకి కొవిడ్ 19 మారుతున్నట్టు కనిపిస్తోందని ప్రపంచ ఆరోగ్యసంస్థ ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాధన్ ఇటీవల వెల్లడించారు. భారత్‌లో జనాభా, రోగనిరోధక శక్తిలో వైవిధ్యాలను బట్టి చూస్తే కొద్దిపాటి హెచ్చుతగ్గులతో కొవిడ్ ప్రస్తుత తరహా లోనే దేశం లోని వివిధ ప్రాంతాల్లో కొనసాగే అవకాశం ఉందన్నారు. 2022 ఆఖరు నాటికి 70 శాతం వ్యాక్సినేషన్ పూర్తయి, కొవిడ్‌కు ముందునాటి పరిస్థితులు తిరిగి వస్తాయన్న ఆశాభావాన్ని స్వామినాధన్ వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News