హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులకు చెప్పకుండానే కరోనా వైరస్ తో చనిపోయిన వ్యక్తికి జిహెచ్ఎంసి సిబ్బంది అంత్యక్రియలు పూర్తి చేసి 20 రోజులైన సమాచారం అందించలేదు. వనస్థలిపురంలో కుటుంబం మొత్తానికి కరోనా పాజిటివ్ వచ్చింది. భర్త మధుసూదన్ కు మొదటగా కరోనా వైరస్ సోకడంతో కింగ్ కోటి ఆస్పత్రి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు. మధుసూదన్ నుంచి కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకడంతో గాంధీ ఆస్పత్రిలో ఐసోలేషన్ వార్డుకు తరలించారు. కరోనా నుంచి కోలుకున్న మిగతా కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకోగా మధుసూదన్ మాత్రం ఇంటికి రాలేదు.
తన భర్త ఎక్కడ ఉన్నాడని ఆస్పత్రి సిబ్బందిని భార్య మాధవిని ప్రశ్నించింది. సిబ్బంది పొంతన లేకుండా సమాధానం ఇచ్చారు. ఒకసారి చనిపోయాడని, మరోసారి వెంటిలే టర్ పై ఉన్నాడని సిబ్బంది సమాధానం ఇవ్వడంతో ఆమె మంత్రి కెటిఆర్ కు ట్వీట్ చేసింది. కుటుంబసభ్యుల అనుమతి లేకుండా తన భర్త మృత దేహానికి అంత్యక్రియలు జిహెచ్ఎంసి సిబ్బంది ఎలా నిర్వహిస్తారని మాధవి ప్రశ్నించింది. ఇదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా కెటిఆర్ కు మాధవి టాగ్ చేసింది. ఈ ఘటన పై గాంధీ సూపరింటెండెంట్ స్పందించారు. మే 1న మధుసూదన్ చనిపోయాడని, మృతదేహాన్ని పోలీసులకు అప్పజెప్పామని వివరణ ఇచ్చారు. జిహెచ్ఎంసి సిబ్బంది కుటుంబ సభ్యుల అనుమతి లేకుండానే మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేసినట్టు సమాచారం. ఇప్పటి వరకు తెలంగాణలో కరోనా వైరస్ 1661 మందికి సోకగా 38 మంది మృత్యువాతపడ్డారు. భారత దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1.12 లక్షలకు చేరుకోగా 3438 మంది చనిపోయారు.