న్యూఢిల్లీ : నాలుగోదశ లాక్డౌన్లో అనేక సడలింపులు చేసి వారం రోజులైనా ఢిల్లీలో కరోనా పరిస్థితి అదుపులో ఉందని వైరస్ కేసుల్లో అసాధారణ పెరుగుదల ఏదీ లేదని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సోమవారం చెప్పారు. మరణాల సంఖ్య పెరిగినా, లేదా నగరం లోని ఆరోగ్యభద్రత వ్యవస్థ విఫలమై కేసులు పెరిగినా ఈ రెండు అంశాలే తాను పట్టించుకుంటానని చెప్పారు. సీరియస్ కేసులు పెరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కేజ్రీవాల్ వివరించారు. ఆన్లైన్ మీడియా సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రుల్లో 4500 పడకలు కరోనా రోగులకు అందుబాటులో ఉన్నాయని, సోమవారం నుంచి ప్రైవేట్ ఆస్పత్రుల్లో కొత్తగా 2000 పడకలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. లాక్డౌన్ నాలుగో దశలో సడలింపులు ఇవ్వడం వల్ల కరోనా కేసులు స్వల్పంగా పెరిగినట్టు తాను భావిస్తున్నానని చెప్పారు. ఢిల్లీలో ఇప్పటివరకు 13, 418 కేసులు నమోదు కాగా, 6540 మంది కోలుకున్నారని, 3314 మంది ఇంటి వద్దే చికిత్స పొందుతున్నారని వివరించారు.