హైదరాబాద్: గ్రేటర్ నగరంలో కరోనా వైరస్ విజృంభణ చేస్తుండటంతో కంటైన్మెంట్ ప్రాంతాలలో నివసించే ప్రజలు టెన్షన్ పడుతున్నారు. ఏ రూపంలో మహమ్మారి సోకుతుందోనని ఆందోళన చెందుతున్నారు. బయటకు వెళ్లాలంటే బయపడిపోతున్నారు. రెండురోజుల క్రితం ప్రభుత్వం గ్రేటర్లోని 158 ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లు విభజించి లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేసూ వైద్య బృందాలతో ఇంటింటికి వెళ్ళి పరీక్షలు చేస్తున్న వైరస్ వేగంగా విస్తరిస్తూ రోజుకు సగటున 100కు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు నగరంలో2138 పాజిటివ్ కేసులు నమోదై 100కు పైగా మరణాలు జరిగాయి.
గత ఐదురోజుల్లో భారీగా కేసులు పెరుగుతున్నాయి. అధికారుల వివరాలు చూస్తే ఈ నెల 1వ తేదీన 79కేసులు, 2న70, 3న108, 4న110, 5వ తేదిన116 కేసులు నమోదై ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తుంది. వారం రోజుల నుంచి సాధారణ ప్రజలతో పాటు వైద్యులు, పోలీసులు, వైద్యాధికారులకు రావడంతో రానున్న రోజుల్లో ఈ మహమ్మారి విశ్వరూపం దాల్చి అమాయక ప్రజల ప్రాణాలు హరిస్తుందని వైద్యాధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వం లాక్డౌన్ సడలింపు చేయడంతోనే కరోనా వైరస్ పరుగులు పెడుతోందని పేర్కొంటున్నారు. నగర ప్రజలు కరోనా వైరస్ పట్ల నిర్లక్షం వహించకుండా మాస్కులు, శానిటైజర్ను వినియోగిస్తే కోవిడ్-19ను కట్టడి చేయవచ్చునని వైద్యులు వెల్లడిస్తున్నారు.