Thursday, April 25, 2024

గాంధీ ఆసుపత్రిలో చికిత్స అద్భుతంగా ఉంది

- Advertisement -
- Advertisement -

వైద్య సిబ్బందికి సలామ్
కొవిడ్ 19 రోగులు ఆందోళన చెందవద్దు
ప్రభుత్వం మెరుగైన సౌకర్యాలు కల్పిస్తోంది
ప్రజలు బాధ్యతగా లాక్‌డౌన్‌కు సహకరించాలి
మన తెలంగాణ ఇంటర్వులో కరోనా బాధితుడు 16 అఖిల్ వెల్లడి

 

మన తెలంగాణ /హైదరాబాద్: “ప్రభుత్వ ఆసుపత్రి అంటే చాలా మందికి చికిత్స ఆలస్యమవుతుందనో, ట్రీట్‌మెంట్ సరిగ్గా ఉండదనే అపోహాలు ఉంటాయి. కానీ గత కొన్ని రోజులుగా ప్రభుత్వాసుపత్రులు కార్పొరేట్‌కు దీటుగా మారాయని చాలా మందికి స్వయంగా చికిత్స చేపించుకునే వరకు తెలియడం లేదు. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్ వైరస్‌కూ ప్రభుత్వాసుత్రుల్లో మెరుగైన వైద్యం అందుతుందని ఇటీవల వైరస్ బారీన పడి కోలుకున్న పెషేంట్ నెం 16 ఎన్నంశెట్టి అఖిల్ వెల్లడిస్తున్నారు. వైరస్ తనలో ఉందని తనకు తెలియదు. కానీ విదేశాల నుంచి రావడంతో తన వల్ల ఇతరులు ఇబ్బందులు పడకూడదనే దృడ సంకల్పంతో స్వయంగా తానే వెళ్లి గాంధీ ఆసుపత్రిలో టెస్టులు చేపించుకున్నాడు. ఎయిర్‌పోర్ట్‌లో ఎలాంటి లక్షణాలు చూపించకపోయినా, తన సందేహాన్ని నివృత్తి చేసుకునేందుకు పరీక్షలు చేపించుకోగా, పాజిటివ్ వచ్చిందని, దీంతో తనకు తానే కృతజ్ఞతలు తెలుపుకున్నానని అన్నారు. అతని ముందస్తు జాగ్రత్తలతో కనీసం ఒక్క వ్యక్తిని కూడా క్వారంటైన్ చేయాల్సిన పరిస్థితి రాలేదు. ఇతను తీసుకున్న నిర్ణయానికి అధికారులంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. ”

ఎన్నంశేట్టి అఖిల్ వృత్తి రిత్య న్యాయవాది. 24 ఏళ్లు కలిగిన ఈ యువకుడు బ్రిటన్ యూనివర్సిటీలో హ్యూమన్ రైట్స్‌లాలో పోస్ట్ గ్రాడ్యూయేషన్ చేస్తున్నారు. అయితే కొవిడ్ నేపథ్యంలో బ్రిటన్‌లో విధించిన లాక్‌డౌన్ పరిస్థితుల్లో ఇటీవల ఇండియాకు వచ్చారు. కానీ విమానం ఎక్కిన దగ్గర నుంచి అతనిలో ఓ ఆందోళన. తనకు వైరస్ సోకిందేమోనని అనుమానం.ఎయిర్‌పోర్ట్ చెకింగ్‌లో చేసిన థర్మల్ స్క్రీనింగ్‌లో కూడా తనకు లక్షణాలు లేవని అధికారులు చెప్పారు. కానీ తనలో ఉన్న సందేహాలను నివృత్తి చేసుకునేందుకు నేరుగా గాంధీ ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేపించుకున్నారు. పాజిటివ్ రావడంతో 14 రోజుల పాటు చికిత్స పొంది పూర్తిగా కోలుకున్న తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన ఆసుపత్రిలో ఎదుర్కొన్న పరిస్థితులను మన తెలంగాణ ఇంటర్వూలో పంచుకున్నారు.

మన తెలంగాణ… మీకు కరోనా సోకిందనే అనుమానం ఎలా వచ్చింది?

అఖిల్….బ్రిటన్‌లో వైరస్ వ్యాప్తి చాలా ఎక్కువగా ఉంది. నేను అక్కడ ఉన్నప్పుడు చాలా మంది స్నేహితులతో కలసి తిరిగాను. ఈ క్రమంలో ఇండియాకు వచ్చే ముందు రాత్రి నుంచి నాకు చిన్నపాటి దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఉండేవి. అప్పటికే ఈ వైరస్ కోసం వివిధ మాధ్యమాల్లో నేను చదివాను కావున నాకూ వైరస్ సోకిందేమోనని ఒక సందేహం.

మన తెలంగాణ….పాజిటివ్ వచ్చాక మీరు ఎలా ఫీలయ్యారు?

అఖిల్…ముందుగా ఆందోళన పడ్డాను. తర్వాత నాకు నేనే ధన్యవాదాలు తెలుపుకున్నా. ఎందుకంటే నేను తీసుకున్న ముందస్తు జాగ్రత్తల వల్ల ఒక్క వ్యక్తిని కూడా క్వారంటైన్ చేయాల్సిన పరిస్థితులు రాలేదు.

మన తెలంగాణ..ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?

అఖిల్…ఈ వైరస్ గురించి నేను ముందే కొన్ని ఆర్టికల్స్ చదివాను. కావున లండన్ విమానాశ్రయంలో ప్లైట్ ఎక్కే దగ్గర నుంచి హైదరాబాద్ చేరుకునే వరకు ఇతరుల నుంచి సామాజిక దూరం పాటించాను. అదే విధంగా హైదరాబాద్ చేరుకున్నాక ఒక హోటల్‌ను అద్దెకు తీసుకొని, అక్కడ సిబ్బందిని కూడా నా రూంకి రావొద్దన్నాను. అంతేగాక అమ్మనాన్నలకు కూడా టెస్టులు చేపించుకొని వస్తానని ముందే చెప్పా. వాళ్లూ అంగీకరించారు. వెంటనే అదే రోజు గాంధీ ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేపించుకోగా పాజిటివ్‌గా తేలింది.

మన తెలంగాణ…..హైదరాబాద్ వచ్చాక ఎయిర్‌పోర్ట్ సిబ్బంది పరీక్షలు నిర్వహించలేదా?

అఖిల్….మార్చి 19న హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నా. నేనే స్వయంగా వెళ్లి డెస్క్‌లో నాకు గొంతునొప్పి ఉందని చెప్పాను. వారు థర్మల్ స్క్రీనింగ్ చేశారు. కానీ బాడీలో టెంపరేచర్ సాధారణంగానే ఉందని, కానీ ఇంట్లో క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు.

మన తెలంగాణ….గాంధీ ఆసుపత్రిలో చికిత్స ఎలా ఉంది?
అఖిల్……గాంధీ ఆసుపత్రిలో చికిత్స అద్భుతంగా ఉంది. కరోనా వార్డులలో మంచి వాతావరణం ఉండేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రతి రోజూ గదులను శుభ్రపరుస్తారు. బాత్ రూం, ప్లోర్, విండోస్ అన్ని రోజూ క్లీన్ చేస్తారు. దీంతో పాటు రోగుల బెడ్ షీట్లు, రోగి వేసుకొనే ప్రత్యేక సూట్‌లు కూడా ఎప్పటికప్పుడు మార్చేస్తారు. రోగులకు ప్రతి రోజూ 4 సార్లు పోషకాహారం అందిస్తారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి మంచి మీల్స్ అందిస్తారు. దీంతో పాటు ఎగ్, డ్రై ప్రూట్స్ స్నాక్స్‌గా ఇస్తారు.

మన తెలంగాణ…ఆసుపత్రిలో చేరకా, భయాందోళన కలుగలేదా?

అఖిల్….సాధారణంగానే ప్రభుత్వ ఆసుపత్రి అంటే భయం కలుగుతుంది కదా…కానీ ప్రస్తుతం చాలా మార్పులు వచ్చాయి. కొంత మంది సోషల్ మీడియలో పెట్టే వార్తలు చూసి కూడా చాలా ఆవేదన చెందాను. బయట జరుగుతున్న ప్రచారానికి ఆసుపత్రిలో విధానానికి చాలా తేడా ఉంది. తప్పుడు ప్రచారాలు చేయవద్దని నా విజ్ఞప్తి.

మన తెలంగాణః వైద్యుల ప్రవర్తన ఎలా ఉంది?

అఖిల్‌ః కరోనా వైరస్‌కు చికిత్సను అందించే వైద్యులు నిజంగా దేవుళ్లు. దీంతో పాటు నర్సుల చేస్తున్న కృషి కూడా అద్భుతం. వాళ్లు కరోనా రోగులకు పునర్జన్మనిస్తున్నారు. సొంత కుటుంబ సభ్యుల్లా వ్యవహరిస్తున్నారు. చాలా తక్కువ వేతనాలకూ వైద్య సిబ్బంది వారి ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్నారు. ప్రతి రోజూ వైద్యులు, నర్సులు రోగికి చాలా ధైర్యం కల్పిస్తారు. వైద్య సిబ్బందికి సలామ్ చేస్తున్నా.

మన తెలంగాణః చివరగా కరోనాపై మీరు ఇచ్చే సూచనలు..?

అఖిల్‌ః కరోనా రోగులను దోషులుగా చూడవద్దు. దీంతో వాళ్లు మానసికంగా కృంగిపోయి, మరణాలకు దగ్గరవుతారు. అదే విధంగా రోగుల సైతం ఆందోళన చెందాల్సిన పనిలేదు. తెలంగాణ ప్రభుత్వం ఆసుపత్రులతో అద్భుతమైన సౌకర్యం కల్పించింది. రోగులకు ప్రత్యేక చికిత్సను అందిస్తున్నారు. వ్యాక్సిన్లు లేవు కావున వైద్యులు చెప్పిన సూచనలు పాటిస్తూ ధైర్యంగా ఉండి రోగ నిరోదక శక్తిని పెంచుకునే ఆహారం తీసుకోవాలి. దీంతో పాటు సమాజ హితం కోసం స్వీయ నిబంధనలు తప్పనిసరి. వైరస్ చైన్‌ను బ్రెక్ చేయాలంటే ప్రస్తుతం మన వద్ద ఉన్న మార్గం లాక్‌డౌన్ మాత్రమే. ప్రజలంతా లాక్‌డౌన్‌కు సహకరించాలని నా విజ్ఞప్తి.

 

Corona treatment is good in Gandhi Hospital
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News