సోమవారం 64 మంది మృత్యువాత
చైనాలో అనేక నగరాలు దిగ్బంధం
జపాన్ ఓడలో ఒకరికి కరోనా
బీజింగ్ : ప్రాణాంతకమైన కరోనా వైరస్ అంటువ్యాధి బారిన పడి చైనాలో మరణించిన వారి సంఖ్య 425కు చేరింది. సోమవారంనాడు 64 మంది మరణించారు. కాగా, ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 20,438కి పెరిగిందని అధికారులు మంగళవారం తెలిపారు. చైనా పది రోజుల్లో నిర్మించిన 1000 పడకల ఆస్పత్రి ప్రారంభమైన తర్వాత ఈ మరణాలు నమోదయ్యాయి. వేగం గా వ్యాపిస్తున్న ఈ వ్యాధి మరింతగా విస్తరించకుండా చైనా జన సంచారంపై మరిన్ని ఆంక్షలు విధించింది. ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.
చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ చైనా కమ్యూనిస్ట్ పార్టీ అగ్రశ్రేణి నాయకులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. కరోనా సంక్షోభం మొదలైన తర్వాత ఇలాంటి సమావేశం జరగడం ఇది రెండోసారి. వ్యాధిని అరికట్టేందుకు మనం సమయంతో పరుగెత్తాలని ఆయన పొలిట్ బ్యూరో స్టాండింగ్ కమిటీకి విజ్ఞప్తి చేశారు. ఇలా ఉండగా షాంఘైకి 175 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పట్టణం తో సహా అనేక చైనా నగరాల్ని దిగ్బంధం చేశారు.
ఇందువల్ల దాదాపు కోటీ ఇరవై లక్షల మంది ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజులకొకసారి కుటుంబంలో ఒకరు మాత్రమే నిత్యావసరాలకు బయటికెళ్లాలని ఆంక్ష విధించారు. జపాన్లో ఓడలో ఒకరికి కరోనా వైరస్ సోకినట్టు పాజిటివ్ రిపోర్ట్ రావడంతో ఆ ఓడలో ఉన్న 3,000 మందికి పైగా ప్రయాణికులను విడిగా ఉంచేందుకు అధికారులు నిర్ణయం తీసుకుంటున్నారు. ఇతర దేశాలు తమ పౌరుల్ని చైనాలోని హుబెయి ప్రావిన్స్ నుంచి ఖాళీ చేయిస్తున్నాయి.
Coronavirus Death Toll Rises to 425