Saturday, April 20, 2024

పిల్లల్లో మళ్లీ కొవిడ్ కలకలం.. వైద్య నిపుణుల సూచనలు

- Advertisement -
- Advertisement -

Covid again in childrens Says Medical experts

న్యూఢిల్లీ : దేశంలో పాఠశాలలు తిరిగి ప్రారంభం అయ్యాక ఇటీవలి కాలంలో ఢిల్లీ, నోయిడా వంటి అనేక నగరాల్లోని పిల్లల్లో మరోసారి కొవిడ్ కేసులు రావడం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో పలువురు వైద్య నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు. పిల్లల్లో కరోనా వస్తున్నా లక్షణాలు స్వల్పంగానే ఉంటున్నాయనీ, దీనిపై ఎవరూ ఆందోళన చెందనక్కర లేదని, అర్హులైన పిల్లలంతా తక్షణమే వ్యాక్సిన్ వేయించుకోవాలంటున్నారు. మాస్క్ ధరించడం, శానిటైజర్ వాడటం, తరచూ చేతుల్ని శుభ్రపర్చుకోవడం వంటి మార్గదర్శకాలను పిల్లలు, ఉపాధ్యాయులు స్థిరంగా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లల్లో కరోనా వచ్చినా ఆ ప్రభావం స్వల్పంగానే ఉంటోందనీ, లక్షణాలకు తగిన చికిత్స తోనే కోలుకుంటున్నట్టు గతంలో వచ్చిన కొవిడ్ దశల డేటాయే స్పష్టంగా చెబుతోందని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు.

ఇప్పటికీ ఇంకా టీకాలు వేయించుకోని పిల్లలైనా భయపడాల్సిన పనిలేదని, వారికి తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉండదని పేర్కొన్నారు. పాఠశాలలు మూసివేసిన సమయంలో దాదాపు 70 నుంచి 90 శాతం మంది పిల్లలు ఇన్‌ఫెక్షన్ బారిన పడినట్టు వేర్వేరు సీరో ప్రెవెలెన్స్ సర్వేల ద్వారా తెలుస్తోందని ఫిజీషియన్ ఎపిడిమియోలజిస్ట్ డాక్టర్ చంద్రకాంత్ లహరియా అన్నారు. కొత్త వేరియంట్లు వచ్చినా పిల్లలపై చూపించిన ప్రభావం స్వల్పంగానే ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కొవిడ్ వ్యాప్తికి పాఠశాలలు వాహకాలుగా లేనట్టు అంతర్జాతీయంగా వస్తున్న ఆధారాలు సూచిస్తున్నాయనీ ఐసీఎంఆర్ అదనపు డీజీ సమీరన్ పాండా అన్నారు. ఐదేళ్ల లోపు పిల్లలకు మాస్క్‌లు సిఫారసు చేయనప్పటికీ , ఆరు నుంచి 11 ఏళ్ల వయసు వారు మాత్రం తమ వినియోగ సామర్ధాన్ని బట్టి మాస్క్ ధరించ వచ్చని తెలిపారు. 12 ఏళ్లు అంతకన్నా ఎక్కువ వయసు కలిగిన వారు మాత్రం పెద్దల మాదిరిగానే మాస్క్‌లు వినియోగించుకోవాలని పాండా సూచించారు.

పాఠశాలల్లో తగిన వెలుతురు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని , ఎయిర్ కండిషన్ వాడకానికి దూరంగా ఉండాలన్నారు. కరోనా సోకే ప్రమాదం లేకుండా తరగతి గదుల్లో ఎగ్జాస్ట్ ఫ్యాన్లు అమర్చాలని సూచించారు. పిల్లలంతా కలిసి ఒకే చోట భోజనం చేయకుండా చూడటంతోపాటు క్యాంటీన్లు, డైనింగ్ హాళ్లలో ఎక్కువ సేపు గడపకూడదని సూచించాలన్నారు. అర్హులైన చిన్నారులంతా తక్షణమే టీకాలు వేయించుకొనేలా తల్లిదండ్రులు చూడాలని, ఇంద్రప్రస్థ అపోలో ఆస్పత్రుల సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ నమీత్ జెరాత్ సూచించారు. కొవిడ్ సోకిన పిల్లలంతా టీకా వేయించుకోడానికి కనీసం మూడు నెలల కాలం పాటు వేచి ఉండాలన్న విషయాన్ని తల్లిదండ్రులు గమనించాలన్నారు. పిల్లలకు ఏమైనా ఎలర్జిటిక్ సంబంధించి చికిత్స తీసుకుంటుంటే మాత్రం కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలన్నారు. వ్యాక్సినేషన్ అనంతరం పిల్లలకు స్వల్ప జ్వరం, ఛాతీనొప్పి వంటివి రావొచ్చనీ, ఆ సమయంలో కేవలం అవసరమైతే పారాసిటమాల్ వాడాలన్నారు. వ్యాక్సినేషన్‌కు ముందు పిల్లలకు పారాసిటమాల్ ఎట్టిపరిస్థితుల్లో ఇవ్వవద్దని డాక్టర్ జెరాత్ సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News