స్వదేశీ సంస్థ జైడస్ క్యాడిలా సంస్ద తయారు చేసే డైకొవ్డి టీకా పంపిణీ
ముందుకు 12 ఏళ్లపైబడిన పిల్లలకు చేసేందుకు ప్రయత్నాలు
చిన్నారులు గుర్తించేందుకు వైద్య ఆరోగ్యశాఖ చర్యలు వేగం
టీకా పంపిణీపై హర్షం వ్యక్తం చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు
హైదరాబాద్: కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు వైద్య ఆరోగ్యశాఖ వ్యాక్సిన్ తీసుకొచ్చి ప్రజలకు పంపిణీ చేయడంతో వైరస్ నుంచి చాలామంది ఉపశమనం పొందారు. జనవరి 23వ తేదీన ప్రారంభమైన ఇప్పటివరకు గ్రేటర్ నగరంలో 65 లక్షలమందికి 118 ఆరోగ్య కేంద్రాల ద్వారా టీకా పంపిణీ చేశారు. 18 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సిన్ విజయవంతం కావడంతో వచ్చే నెల దసరా నుంచి నగరంలో 12 ఏళ్ల పైబడిన పిల్లలకు కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు సిద్దం చేస్తున్నట్లు వైద్యాధికారులు వెల్లడిస్తున్నారు. గుజరాత్కు చెందిన జైడస్ క్యాడిలా సంస్ద తయారు చేసిన డై కొవ్ డి టీకా దసరా పండగత తరువాత అందుబాటులోకి వచ్చే అవకాశముందంటున్నారు. ఇప్పటికే కేంద్ర వైద్యశాఖ నుంచి ఏసమయంలోనైనా టీకా సరఫరా చేస్తామని అందుకు తగ్గట్లు వైద్య సిబ్బంది, సెంటర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచనప్రాయంగా చెప్పినట్లు వైద్య సిబ్బంది పేర్కొంటున్నారు.
స్వదేశీ తయారీ టీకా జైకొవ్డి ఇది డిఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్. 28 రోజుల వ్యవధిలో మూడు డోసులు పంపిణీ చేస్తారు. సూది లేకుండా అతి సన్నటి జెట్ ద్వారా చర్మానికి వేస్తారు. ఇందు కోసం కొలరాడోకు చెందిన ఫార్మా జెట్ కంపెనీ తయారు చేసిన నీడిల్ రహిత వ్యవస్దను జైడస్ ఉపయోగించనుంది. తక్కువ సమయంలో ఎక్కువ మంది చిన్నారులకు టీకా పంపిణీ చేయవచ్చని ఇప్పటికే ఆసంస్ద ప్రకటించింది. వ్యాక్సిన్ పిల్లలకు ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య సమాలోచనలు చేస్తున్నట్లు వైద్యశాఖ వెల్లడిస్తుంది. నెలాఖరులో గ్రేటర్ నగరంలో ఎంతమంది చిన్నారులు ఉన్నారో వివరాలు సేకరించాలని కూడా ఆదేశించినట్లు, వీరికి పంపిణీ చేసేందుకు ఎంతమంది సిబ్బంది అవసరమో వంటివి సిద్దం చేసే పనిలో వైద్యఅధికారులు ఉన్నారు.
వైద్య, విద్యాశాఖ అంచనా ప్రకారం మహానగరం పరిధిలో 12 ఏళ్లపై బడిన వారు 17 లక్షల వరకు ఉన్నట్లు భావిస్తున్నారు. మూడు డోసుల చొప్పన 54లక్షల వరకు డోసులు అవసరం. దసరా పండుగలోగా పిల్లల టీకా పంపిణీ తగిన ఏర్పాట్లు చేస్తామని వైద్యాధికారులు చెబుతున్నారు. టీకా పంపిణీపై విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ పిల్లలను స్కూళ్లకు పంపేందుకు సిద్దమైతున్నారు. బడులు ప్రారంభమై నాలుగు రోజులు గడిచిన ఇంకా 50 శాతం వరకు హాజరు శాతం నమోదు కావడంలేదు. వచ్చే నెలల్లో టీకా పాఠశాలలకు వచ్చే చిన్నారులకు వేసే అవకాశం ఉండటంతో రేపటి నుంచి బడిబాట పట్టిస్తామని పేర్కొంటున్నారు.