న్యూఢిల్లీ : భారతదేశం కొవిడ్ వ్యాక్సిన్ కోసం మరెంతో కాలం వేచి ఉండాల్సిన పనిలేదని ప్రధాని మోడీ తెలిపారు. ఆగ్రా మెట్రో రైలు ప్రాజెక్టు శంకుస్థాపన సందర్భంగా తమ ప్రసంగంలో ఆయన టీకా మందు గురించి ప్రస్తావించారు. తొందరలోనే ప్రజలకు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. అయితే వ్యాక్సిన్ వస్తుంది కదా అని ఇప్పటి జాగ్రత్తలు విషయంలో ఎటువంటి నిర్లక్షం అయినా పనికిరాదని సూచించారు. వైరస్ వ్యాప్తిని అదుపులో పెట్టే నియంత్రణ చర్యలపై జాగరూకత అత్యవసరం అన్నారు. ఇటీవలి కాలంలో తాను కొవిడ్ వ్యాక్సిన్ రూపకల్పన విషయంలో ప్రగతిని తెలుసుకున్నానని, ఈ క్రమంలో పలువురు సంబంధిత పరిశోధకులు, శాస్త్రవేత్తలతో మాట్లాడినట్లు, ఈ క్రమంలో వ్యాక్సిన్ రావడానికి ఇంకా ఎంతో దూరం లేదని తనకు స్పష్టం అయిందని తెలిపారు. వ్యాక్సిన్ కోసం మరెంతోకాలం వేచిచూడాల్సిన అవసరం లేదన్నారు. ఓ వైపు నిర్థిష్టంగా వ్యాక్సిన్ వచ్చి తీరుతుంది. అయితే మరో వైపు జాగ్రత్తగా ఉండటం వ్యాక్సిన్ కన్నా బాగా పనిచేస్తుందని తేల్చిచెప్పారు.