Friday, April 19, 2024

రద్దయిన ‘కౌ హగ్గింగ్ డే’

- Advertisement -
- Advertisement -

విద్య అసలు లక్షం సమాధానాలను అందించడం కాదు, మరిన్ని ప్రశ్నలు సంధించడం ఎలాగో నేర్పించడం! హెలెన్ కెల్లర్ అమెరికన్ రచయిత్రి, ఉపాధ్యాయురాలు. ఈ దేశంలో ముప్పయి అయిదు స్మృతులున్నాయి. అందులో లభించినవి ఇరవై అయిదు మాత్రమే. అందులో అతి ముఖ్యమైంది మనుస్మృతి. ఒక రకంగా ఈ దేశంలో పాత రాజ్యాంగం మనుస్మృతే. ఆ మనుధర్మ శాస్త్రంలో నేరస్థులకు వేసే శిక్షలు ఇలా వున్నాయి. వీటిలో వున్న తేడాల్ని శ్రద్ధగా గమనించాలి. శిక్ష ఎవరికైనా కానీయండి, లాభం మాత్రం బ్రాహ్మణ వర్గానికి చేరూరే విధంగా రాసుకోవడం ఇక్కడ గమనించాల్సిన విషయం.

1. బ్రాహ్మణుడు క్షత్రియుణ్ణి చంపితే వేయి ఆవులు, ఒక ఎద్దు ఉత్తమ బ్రాహ్మణుడికి ఇవ్వాలి. అదే దోష పరిహారం. అదే శిక్ష (మనుధర్మం 11127), 2. బ్రాహ్మణుడు వైశ్యుణ్ణి చంపితే దోష పరిహారంగా వంద ఆవులను, ఒక ఎద్దును మరొక బ్రాహ్మణోత్తముడికి దానం ఇవ్వాలి (మనుధర్మం 11128), 3. ఒక వేళ బ్రాహ్మణుడు శూద్రుణ్ణి చంపితే పది ఆవులు, ఒక ఎద్దును మరో బ్రాహ్మణోత్తముడికి దానం ఇవ్వాలి (మనుధర్మం 11 130), 4. ఒక బ్రాహ్మణుణ్ణి చంపడం కంటే మహాపాపం ఈ భూమి మీద మరొకటి లేదు. కాబట్టి రాజు కూడా బ్రాహ్మణుణ్ణి చంపకూడదు. చంపించకూడదు.

అసలు ఆ ఆలోచనే మానుకోవాలి (మనుధర్మం 8 361). ఏకపక్షంగా సాగిన ఈ శిక్షలు (దానాలు) పాపం పేరుతో పరిపాలకుల చేతులు కూడా కట్టేశాయి. మనుస్మృతి సహాయంతో సమాజంలో తమ స్థాయి అత్యున్నతంగా నిలుపుకొన్న బ్రాహ్మణ వర్గమేమీ ప్రత్యేకంగా అవతరించిన వారు కాదు. జీవ పరిణామ క్రమంలో ఏర్పడ్డ ఆ మహా మిశ్రమ సంతతి వారే. వారి కుట్రలు, కుతంత్రాల సహాయంతో తమని తాము ప్రత్యేకంగా నిలుపుకొన్నారు. అంతే! వారి మనుస్మృతి నిజమైతే మరి రావణుణ్ణి రాముడెలా చంపాడూ? వారు రాసుకొన్న రామాయణంలోనే రావణుడు బ్రాహ్మడు. రాముడు క్షత్రియుడు. బ్రాహ్మణుణ్ణి క్షత్రియుడు చంపితే హర్షిస్తున్నారెందుకూ. రాముడికి శిక్ష పడాలి కదా? ఆ విషయం ఎందుకు ఆలోచించరూ?

ఎప్పుడో రాయబడ్డ మనుస్మృతిలోని అంశాలు యథాతథంగా సమాజంలోని అన్ని వర్గాలు ఇప్పుడు కూడా ఆచరించాలని మనువాదులు ఆరాటపడుతుంటారు. కాలానుగుణంగా వస్తున్న మార్పుల్ని, నూతన ఆవిష్కరణల్ని వారు పరిగణనలోకి తీసుకోరు. వారి పూర్వీకుల అడుగుజాడల్లో నడుస్తూ కొందరు సమకాలీన అంశాలను కూడా తమ మనుస్మృతిలో రాయబడి ఉన్నట్టు భ్రమిస్తూ వుంటారు లేదా మనుస్మృతికి అనుగుణంగా తామే కథలు అల్లుతుంటారు. అలాంటి కొన్ని అసంబద్ధమైన విషయాలు పరిశీలిద్దాం! అలాంటి వాటిని నమ్మకుండా ఉండగలగాలి. తెలివిగా తిప్పికొడుతూ విషయం జనబాహుళ్యానికి తెలియజేస్తూ వుండాలి. ఇది అందరి సమిష్టి బాధ్యత! ఉదాహరణకు డైనోసార్స్ అంతరించిపోయిన జంతువులు.

అవి ఏ దేవుడికీ వాహనం కాలేకపోయాయి. కారణం ఏమిటంటే అవి జీవించి వున్న కాలంలో దేవుడిని సృష్టించుకొన్న మనిషి లేడు కాబట్టి! కానీ, పంజాబ్ యూనివర్శిటీకి చెందిన ఓ మనువాది ఒక కొత్త విషయం కనిపెట్టాడు. ఆయన ఒక భూవిజ్ఞాన శాస్త్రవేత్త పేరు అశుఖోస్లా. డైనోసార్లను తొలిసారి కనిపెట్టింది బ్రహ్మ దేవుడే” అని ప్రకటించాడు. దానికి సంబంధిత ప్రస్తావన వేదాల్లో వుందని బల్లగుద్ది చెప్పాడు. ఎక్కడ వుంది? ఎలా వుంది? వివరంగా చెపితే అందరికీ బోధపడేది కదా? బ్రహ్మ ఒక కల్పించుకొన్న దేవుడు. డైనోసార్లు ఈ భూమి మీద పుట్టి, కొన్ని వేల ఏళ్ళ పాటు తమ ఉనికిని చాటుకొని కాలక్రమంలో అంతరించిపోయిన జీవులు. వాటిని బ్రహ్మదేవుడు కనిపెట్టడమేమిటీ? ఇతర దేశస్థులకు డైనోసార్ల గురించి తెలుసు కానీ, హింద పురాణాల్లోని బ్రహ్మ దేవుడి గురించే తెలియదు. ప్రపంచ దేశాల వైజ్ఞానికులంతా అంగీకరిస్తేనే ఏదైనా వైజ్ఞానిక అంశంగా గుర్తించబడుతుంది.

ఆధారాలు లేకుండా చేసే మూర్ఖపు ప్రకటల్ని శాస్త్ర జగత్తు అంగీకరించదు. డైనోసార్ల మీద పరిశోధనలు చేసిన వారి విలువ తగ్గించడానికి అశుఖోస్లా అనేవాడు ఒక అబద్ధం ప్రకటించాడు. పోనీ, మన దేశంలోని ప్రఖ్యాత వేద పండితులైనా బ్రహ్మ దేవుడి పరిశోధనల గూర్చి మాట్లాడలేదేమీ చెప్పా? వేదాలలో ఏమున్నదో వారికి బాగా తెలుసు కదా? మన దేశంలో నేటి దేశభక్తుల తెలివి మామూలుగా వుండడం లేదు. వారు చేసిన, చేస్తున్న ప్రచారాలు ఎటా వుంటున్నాయో అందరికీ తెలుసు అందులో ఒకటి ఇలా వుంది. “గోవుని హత్తుకోవడం వల్ల ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. తద్వారా ఒంటరితనం వుండదు. మానసిక ఆందోళన తగ్గుతుంది అని క్రైస్తవ దేశమైన నెదర్లాండ్‌లో ఆ దేశపు యూనివర్శిటీ ప్రకటించింది. మరి ఈ విషయం ఇక్కడి గొర్రెలకు ఎప్పుడు అర్థమవుతుందో” అనే ఒక పోస్టర్ జై గోమాత శీర్షికతో ప్రచారమైంది. జై గోమాత శీర్షికతో ఇలాంటివి ఎవరు ప్రచారం చేస్తారో వేరే చెప్పనక్కర లేదు కదా? సరే ఇదే విషయం మనం కొంచెం లోతుగా ఆలోచిద్దాం! అప్పుడు గొర్రెలెవరో బాగా తెలుసుకోవచ్చు.

మన మెదడులో హైపోథాలమస్ అనే భాగం వుంటుంది. ఇది రక్తపోటును, గుండె కొట్టుకునే విధానాన్ని, శరీర ఉష్ణోగ్రతని, జీర్ణ వ్యవస్థని ప్రభావితం చేస్తుంది. మెదడు కింద భాగంలో ఒక చిక్కుడు గింజంత పరిమాణంలో పిటుటరీ గ్రంధి వుంటుంది. ఇక, ఆక్సిటోసిన్ అనేది ఒక హార్మోన్. హార్మోన్ అంటే రసాయనిక పదార్ధం. ఈ ఆక్సిటోసిన్ హైపోథాలమస్‌లో ఉత్పత్తి అయి కింద వున్న పిటుటరీ గ్రంధిలో నిలువ వుంటుంది. ఆ హార్మోన్ అవసరమైనప్పుడు రక్త ప్రవాహంలో కలిసి శరీరంలో ఏ భాగానికి అవసరమైతే ఆ భాగానికి చేరుకుంటుంది.

ముఖ్యంగా ఈ హార్మోన్ స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి అవయవాలకు అందుతుంది. స్త్రీలలో కాన్పు జరగడానికి, కాన్పు తర్వాత పాలు పడడానికీ ఈ ఆక్సిటోసిన్ హార్మోన్ ఉపయోగపడుతుంది. ఇవి ఆక్సీటోసిన్‌కు సంబంధించిన వైజ్ఞానిక వివరాలు. రోడ్డు మీద గోవు కనబడగానే ఎవరు పడితే వారు హత్తుకుంటే ఆక్సిటోసిన్ హార్మోన్ విడుదల కాదు. ఆ గోవును చిన్నప్పటి నుండి పెంచుకొన్న వారికి దాని మీద ప్రేమ వుంటుంది. అలాంటి వారు దాన్ని హత్తుకుంటారు. వేరే వాళ్ళకు ఆ కోరికే కలగదు. గోవు ఏమైనా గర్ల్‌ఫ్రెండా? జీవిత సహచరా? అదొక జంతువు. కౌగలించుకొన్న వాడు మనిషి. హార్మోన్లు ఉత్పత్తి అయ్యే అవకాశమే వుండదు. నెదర్లాండ్ కాదు గదా ప్రపంచంలో ఏ యూనివర్శిటీ ఈ విషయం ప్రకటించలేదు. అదొక అబద్ధం. తెలివి లేని గొర్రెలే ఇలాంటివి నమ్ముతారు. ఒకటి రెండు సైన్సు పదాలు పట్టుకొని జనాన్ని మభ్యపెట్టడానికి దేశభక్తులు చేసే వ్యర్థ ప్రయత్నం ఇది. శ్రీరాముడు మోడీ రూపంలో అవతారం ఎత్తాడు అని దేశభక్తులు భజన చేయడం ప్రారంభించారు. అంతేకాదు, లక్ష్మణుడు అమిత్ షా రూపంలో జన్మించాడట. ఇక హనుమంతుడు ఆదిత్యనాథ్ రూపం దాల్చాడట.

ఈ దేశంలో రామరాజ్యం కలను వీళ్ళంతా నిజం చేయడానికి సంకల్పించారట. ఇకపోతే బెంగాల్ సి.ఎం. మమతా బెనర్జీని శూర్పణఖతో పోల్చాడు ఉత్తరప్రదేశ్ బిజెపి ఎం.ఎల్.ఎ. సురేంద్ర సింగ్. బావుంది. పోలికలన్నీ బాగానే వున్నాయి కానీ, ఆ ఎంఎల్‌ఎ సురేంద్ర సింగ్ ఇంకా ఒక విషయం చెబితే బావుండేది. రాముడు సీతను ఏ అడవిలో వదిలేశాడో కూడా చెప్పాల్సింది. ఏమైనా అతని వల్ల ఒక మేలు జరిగింది! ఇంత వరకూ వున్న ‘రామరాజ్యం’ భ్రమల్ని బద్దలు కొట్టాడు. రామరాజ్యం ఇంత హీనంగా వుంటుందన్న నిజాన్ని చెప్పి, ప్రజల కళ్ళు తెరిపించాడు. ముస్లింల పేర్లు ఉస్మాన్, రహమాన్ లాగా ఆంజనేయుడి పేరు హనుమాన్ అని వుంది కాబట్టి, హనుమాన్ ముస్లిం అని ప్రకటించాడు మరో దేశభక్త నేత. హిందీ మాట్లాడం అని అనేవారు.. దేశం వదిలి వెళ్ళాలని ఒక యుపి దేశభక్తుడు ఆజ్ఞాపిస్తే, తమిళనాడు విద్యామంత్రి సవినయంగా ఇలా నివేదించుకున్నాడు. “అయ్యా! హిందీ వచ్చిన వాళ్ళు మా కోయంబత్తూర్‌లో పానీపురి అమ్ముకొంటున్నారు. ఏం ఫరవాలేదు.. మాకు తమిళం, ఇంగ్లీషు భాషలు చాలు” అని ప్రకటించాడు మంత్రి కె. పొన్ముడి. “ఎక్కువ మాట్లాడితే మాకు స్వతంత్ర ప్రతిపత్తి కావాలని డిమాండ్ చేస్తాం” అని కూడా స్టాలిన్ ప్రభుత్వం ఒక హెచ్చరిక చేసింది.

“మనిషి తన ఆలోచనలతో జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు. జన్మతః కాదు” అన్నది నిజం. కాని వైదిక మతం ఒప్పుకోదు. దాని ప్రకారం కొందరు జన్మతోనే యోగ్యులవుతారు. మరి కొందరు అయోగ్యులవుతారు. ఈ 21వ వైజ్ఞానిక శతాబ్దంలో ఇలాంటి ఆలోచనలు నిలుస్తాయా? ఎప్పటికప్పుడు ఎవరికి వారు వారి వయసు, అనుభవంతో సంబంధం లేకుండా నిరంతరం తెరచిన మెదళ్ళతో జ్ఞానాన్ని సంపాదించుకుంటూ వుండాలి. మన పూర్వీకులకు తెలియని ఎన్నో విషయాలు మన తరానికి తెలుస్తున్నాయి. ఇంకా ముందు తరాలు మరిన్ని కొత్త విషయాలు తెలుసుకుంటూ వుంటారు. తెలుసుకొని ఏం చేయాలి? అంటే మూఢత్వంలో కూరుకుపోకుండా చేతనత్వంతో సజీవంగా జీవించాలి!

పదార్థానికి సంబంధించిన పరమాణువులు, వాటి అమరిక వల్ల ఏర్పడ్డ అణువులు, వాటి నుండి జీవ రసాయనాలు, ఆర్.ఎన్.ఎ; డి.ఎన్.ఎలు లిపిడ్స్, ఏకకణ జీవులు, బహుకణ జీవులు సుమారు నాలుగు వందల కోట్లు అని అనుకుందాం. వీటన్నిటి పరిణామక్రమంలో జరిగిన, జరుగుతున్న ఎన్నో మార్పలు జీవుల మధ్య జరిగిన జీవన్మరణ పోరాటాలు, సహాయ సహకారాలు.. ఎన్ని ఎన్నని చెప్పుకోగలం? ప్రకృతిని చూసి పరవశించడమే కాదు, దాన్ని లోతుగా అర్థం చేసుకోవడం కూడా అవసరం. ఉట్టి ఈస్తటిక్ సెన్స్ వుంటే సరిపోదు, దానితో పాటు సైంటిఫిక్ అవుట్‌లుక్ కూడా నేడు చాలా అవసరం. మనకు తెలిసి కొన్ని, తెలియకుండా కొన్ని ప్రకృతిలో ఎన్నెన్నో జరిగిపోతున్నాయన్న వాస్తవం గ్రహించుకోవాలి కదా? ఈ విషయాలన్నీ ఆలోచించగలిగిన వారికి ప్రపంచాన్ని చూసే దృష్టికోణం వేరుగా వుంటుంది.

ఈ అవగాహన వారి ఆలోచన పరిమితమైన పరిధిలో కుంచించుకుపోయి వుంటుంది. ఒక పరిమితిలో కుంచించుకుపోయిన వారు వారి ఆలోచనా విధానాన్ని, అవగాహనా స్థాయిని పెంచుకోకుండా విశాల దృక్పథం గల వారి మీద అజమాయిషీ చేయాలని చూస్తున్నారు. ప్రపంచంలో జరుగుతున్న అనర్థాలకు, దోపిడులకు, దాడులకు, యుద్ధాలకు ఇదే కారణం! అందువల్ల, ఒక వైపు సృష్టి రహస్యాలు, విశ్వ పరిజ్ఞానం, జీవ పరిణామ పరిజ్ఞానం, సామాజిక జీవనంలో సాధించుకుంటున్న ప్రగతిని గూర్చి సమకాలీనంలో అందరూ తెలుసుకుంటూ వుండాలి. తెలుసుకున్నది వచ్చే తరాలకు అందించగలగాలి. అవగాహన లేని తిరోగమన మార్గం మానవ వినాశనానికి మాత్రమే దారి తీస్తుంది!

డా. దేవరాజు మహారాజు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News