హైదరాబాద్: జిహెచ్ఎంసి ఎన్నికల్లో రాజకీయ పార్టీల నేతలు ర్చెగొట్టే విధంగా ప్రసంగాలు చేయొద్దని, చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ అన్నారు. ఎన్నికల నేపథ్యంలో భద్రతా చర్యల గురించి శుక్రవారం వివరించారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 30 డివిజన్లు ఉన్నాయని తెలిపారు. ఎల్బినగర్ జోన్లో 13, మల్కాజ్గిరి జోన్లో 17 వార్డులు ఉన్నాయని అన్నారు. ఏడు సర్కిళ్ల పరిధిలోని 30 డివిజన్లలో 1,640 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. వీటిలో 498 సమస్యాత్మక, 101 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు.
101 రూట్ మొబైల్ సిబ్బంది ఎన్నికల విధులు నిర్వర్తించనున్నట్లు తెలిపారు. ఏడు ఫ్లైయింగ్ స్కాడ్ బృందాలు ఏర్పాటు చేశామన్నారు. ఒక్కో సర్కిల్కు ఎసిపికి బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. జిహెచ్ఎంసి ఎన్నికలకు ఎనిమిది వేల మందితో భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆరు డిఆర్సీ కేంద్రాల్లో కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని తెలిపారు. రాజకీయ నాయకులు ఎన్నికల నిబంధనలు ఎవరూ ఉల్లంఘించవద్దని కోరారు.