ఖమ్మం: సిపిఐ సీనియర్ నాయకులు టి.వి. చౌదరి(80) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన మంగళవారం రాత్రి తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. సిపిఐలో ఖమ్మం జిల్లా, రాష్ట్రస్థాయిలో పలు బాధ్యతలను టి.వి చౌదరి నిర్వహించారు. రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా, కార్యదర్శిగా ఆయన పని చేశారు. సుదీర్ఘకాలం పాటు సిపిఐ జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. టి.వి చౌదరి మృతిపట్ల సురవరం సుధాకర్ రెడ్డి, పువ్వాడ నాగేశ్వరరావు, చాడా వెంకట్ రెడ్డి, ఖమ్మం జిల్లా సిపిఐ నేతలు, పార్టీ శ్రేణులు సంతాపం తెలిపారు.
బుధవారం ఉదయం 9:30 గంటలకు సిపిఐ జిల్లా కార్యాలయానికి చౌదరి భౌతికకాయాన్ని తరలిస్తారు. టి.వి చౌదరి మృతి పట్ల సిపిఐ నేత రామకృష్ణ సంతాపం తెలిపారు. కమ్యూనిస్టు పార్టీకి, రైతు ఉద్యమానికి చౌదరి అందించిన సేవలు ఎనలేనివని ఆయన కొనియాడారు. చౌదరి కుటుంబసభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ టి.వి చౌదరి భౌతికకాయానికి నివాళులర్పించారు.
CPI senior leader TV Choudhury passed away