ముంబై: కరోనా నేపథ్యంలో ఐపిఎల్తో సహా పలు క్రికెట్ టోర్నీలు రద్దు కావడంతో టీమిండియా స్టార్ క్రికెటర్లు కుటుంబ సభ్యులతో కలిసి సరదగా గడుపుతున్నారు. దక్షిణాఫ్రికా సిరీస్ మధ్యలోనే ఆగిపోవడం, ఐపిఎల్ వాయిదా పడడం, పలు దేశావళి క్రికెట్ టోర్నీలను బిసిసిఐ రద్దు చేయడం తదితర కారణాలతో క్రికెటర్లకు పూర్తిగా విశ్రాంతి లభించింది. భారత్తో పాటు పలు దేశాల క్రికెట్ బోర్డులు కరోనా వ్యాధి నేపథ్యంలో క్రికెట్ పోటీలను రద్దు చేశాయి. దీంతో క్రికెటర్లందరూ ఖాళీగా మారారు. దీంతో కలిసి వచ్చిన అవకాశాన్ని వీరు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. కొందరూ సోషల్ మీడియాలో బీజీగా కనిపిస్తున్నారు. మరికొందరూ క్రికెటర్లు దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడంలో బీజీగా మారారు. ఇక, ప్రతిష్టాత్మకమైన ఐపిఎల్ టి20 క్రికెట్ టోర్నీ ఏప్రిల్ 15 వరకు వాయిదా పడిన నేపథ్యంలో ఆయా ఫ్రాంచైజీలు ఆటగాళ్లకు నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాలను రద్దు చేశాయి. దీంతో ఆయా ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహిస్తున్న స్టార్ క్రికెటర్లు తమ తమ సొంత నగరాలకు వెళ్లి పోయారు. ఇదిలావుండగా క్రికెట్కు దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో ఆటగాళ్లు యాక్టివ్గానే కనిపిస్తున్నారు. ఇటు ఫ్రాంచైజీ యాజమాన్యాలతో, అటు అభిమానులతో టచ్లోనే ఉన్నారు. అంతేగాక కరోనా వ్యాధి బారిన పడకుండా తీసుకోవాల్సిన చర్యలను సోషల్ మీడియా వేదికగా అభిమానులకు వివరిస్తున్నారు.
Cricketers relax with Families after called off Cricket