హైదరాబాద్: ఈ నెల 3వ తేదీ నుంచి ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలకు 14 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఇందులో అత్యధికంగా వరి పంట 13 వేల ఎకరాల్లో దెబ్బతిన్నది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రాథమిక పంట నష్టం అంచనా నివేదిను ప్రభుత్వానికి సమర్పించింది. కోతల దశలో ఉన్న వరికి చెడగొట్టు వానలతో తీవ్ర నష్టం వాటిల్లుతోంది. తీవ్రగాలులకు వరి నేలకొరగడం, అక్కడక్కడ వండగండ్ల వర్షంతో గింజ రాలిపోతుందని వ్యవసాయాధికారులు తెలిపారు.
ఇప్పటి వరకు నష్టపోయిన పంటల విలువ (ఇన్పుట్ సబ్సిడీకి) రూ.75 కోట్లుగా ఉంటుందని వ్యవసాయ శాఖ పేర్కొంది. అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లాలో 6176 ఎకరాల్లో, రంగారెడ్డి జిల్లాలో వెయ్యి ఎకరాలు, వనపర్తి జిల్లాలో 4031 ఎకరాల్లో, యదాద్రి భువనగిరి జిల్లాలో 2 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. 10 జిల్లాల్లోని 42 మండలాల రైతులు అకాల వర్షాలకు నష్టపోయారు. మొత్తం 7741 మంది రైతులు పెట్టుబడి పెట్టి, సాగు చేసి పంట కోత చేసే సమయంలో నష్టపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇన్సురెన్స్ కంపెనీలకు సమాచారం
రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలతో వరి, మొక్కజొన్న, మామిడి పంటలకు నష్టం వాటిల్లిందని పిఎంఎఫ్బివై కింద నమోదు చేసుకున్న రైతులు తమ పంటలకు వాటిల్లిన నష్టం గురించి ఆయా జిల్లాలలో, ఇన్సురెన్స్ కంపెనాలకు సమాచారం ఇవ్వాలని వ్యవసాయ శాఖ సూచించింది. నష్టం వాటిల్లిన 72 గంటల లోపల అగ్రికల్చర్ ఇన్సురెన్స్ కంపెనీ 18005992594 ఇఫ్కో టోకియో జనరల్ ఇన్సురెన్స్ కంపెనీ 18001035499 టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేయాలని తెలిపింది.
జిల్లా వ్యవసాయ అధికారులు , సహాయ వ్యవసాయ సంచాలకులు, మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తీర్ణ అధికారులు రైతులకు సహకరించాలని ఆదేశించింది. సంబంధిత ఇన్సురెన్స్ కంపెనీలు వారి అధికారులను సర్వేయర్లగా నియమించి నష్టం నివేదికలను రూపొందించాలని వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి తెలిపారు.