Friday, April 19, 2024

ప్రత్యామ్నాయమే శరణ్యమా!

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయరంగంలో వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి ఆరుగాలం శ్రమించి పంటలు సాగు చేసిన రైతులకు రిక్తహస్తాలే మిగులు తున్నాయి. అకాల వర్షాలు, వడగండ్ల వానలు రైతుల కష్టాన్ని ఊడ్చేస్తున్నాయి. పంటలు కోత దశకు చేరువయ్యాక అకాల వర్షాలు రైతులను తీవ్రంగా దెబ్బతీస్త్తూ, నష్టాలను మిగుల్చుతున్నాయి. అందుకు తాజా ఉదాహరణలే కళ్లకు కడుతున్నాయి. ఈ నెలలో ఇప్పటికే రెండు సార్లు అకాల వర్షంతో సుమారు 10లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఉద్యానతోటలకు కూడా నష్టం వాటిల్లింది. కనీసం వరి, మొక్కజొన్న, జొన్న తదితర ప్రధాన ఆహార పంటలను చివరిదశలో కాపాడుకోవటలో ప్రకృతికి ఎదురీదలేక రైతు నిస్సహాయస్థితిలో ఉండిపోవాల్సివస్తోంది. ప్రకృతి విపత్తుల నుంచి పంటలను కాపాడి రైతులకు నష్టాలను ఏవిధంగా తగ్గించాలన్న దిశగా వ్యవసాయ శాస్త్రవేత్తలు మేధోమథనం చేస్తున్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా ఆ దృష్టిపెట్టింది. భవిష్యత్తులో ప్రకృతి విపత్తుల వల్ల వ్యవసాయ రంగంలో పంట నష్టాలు జరగకుండా తగిన ప్ర ణాళికలను రూపొందించే దిశగాప్రభుత్వం ముం దుకు సాగనుందని ఆర్ధిక శాఖమంత్రి హరీష్‌రావు వెల్లడించారు.

పంటల సాగుకు సంబంధించిన సీ జన్‌ను ఒక నెల రోజులు ముందుకు జరిపేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వరి స్థానంలో అకాల వర్షాలు , వడగండ్ల వానలు తదతర ప్రతికూల వాతావరణ పరిస్థితులకు తట్టుకుని నిలబడే ఇతర ఆయిల్‌పామ్ తోటలను అధికంగా సాగుచేయిస్తామని వెల్లడించారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా ఈ దిశగానే మేధోమథనం సాగిస్తున్నారు. ప్రొ.జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ ్వవిద్యాలయం వేదికగా మూడు రోజల పాటు రాష్ట్ర స్థాయి సాంకేతిక సదస్సు ఈ దిశగానే అడుగులు వేసింది. శుక్రవారం నాటితో ఈ సదస్సు ముగిసింది. సరళి, ఉత్పత్తి, ఉత్పాదకత , రక్షణ, నూతన పరిశోధనల అమలు, తదితర అం శాలపై సదస్సులో విస్తృతంగా చర్చలు జరిపారు. 2023-24కు వ్యవసాయ సీజన్‌కు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేశారు. రాష్ట్రంలోని పంటల సాగు విస్తీర్ణంలో రైతులు వరి , పత్తి పంటలే 85శాతం సాగు చేస్తున్నారు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావాలని సదస్సు దిశానిర్దేశం చేసింది.

పంటల వైవిధ్యీకరణ పట్ల రైతుల్లో అవగాహన కల్పించడం, రెండు సీజన్లలో అధికారికంగా సిఫార్సు చేసిన రకాల పంటలనే సాగు చేయడం, ఎంపిక చేసినవాటినే సాగు చేయడం, అదను కాలంలో విత్తనాలు వేయడం, ఆలస్యంగా వరినాట్లు వేసుకోకుండా ముందు జాగ్రత్త పడడం వంటి వాటిని సూచించారు. పంటల మార్పిడిని కూడా పాటింపజేయాలని సూచించారు. శాస్త్రవేత్తల సాంకేతిక సదస్సు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రంగానికి , తద్వారా రైతులకు ప్రకృతి విపత్తుల నుంచి పంటలను, నష్టాలను తప్పించుకునే, విధంగా వినూత్న ప్రణాళికను సిద్దం చేసింది .రాష్ట్రంలో వాతవరణ పరిస్థితులు , నేలల స్వభావం , విత్తన రకాల ఎంపిక , వివిధ రకాల పంటల సాగు, వనరుల లభ్యత తదితర అంశాలకు సంబంధించి శాస్త్రవేత్తలు , వ్యవసాయ రంగం నిపుణులు వెల్లడిచించిన అభిప్రాయాలతో సిద్ధం చేసిన వినూత్న ప్రణాళికకు తుదిమెరుగులు దిద్ది ప్రభుత్వానికి అందజేయనున్నట్టు వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులు వెల్లడించారు. మరో వైపు ప్రభుత్వం కూడా తెలంగాలో వ్యవసాయ అభివృద్ధి పధకాలు , వాటి అమలు ద్వారా వస్తున్న ఫలితాలు తదితర అంశాలను సమీక్షించుకుని మెరుగైన ఫలితాల దిశగా అడుగులు ముందుకు వేయాలన్న అభిప్రాయంతో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News