శాంతియుత ప్రదర్శనలకు అనుమతి
న్యూయార్క్: ఆఫ్రోఅమెరికన్ జార్జ్ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా అమెరికాలో శాంతియుత ర్యాలీలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆందోళనకారులు పోలీసులతో ఘర్షణలు, దుకాణాలపై దాడులు నిలిపి వేసి శాంతియుతంగా ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. దాంతో, న్యూయార్క్లో కర్ఫూను తొలగిస్తున్నట్టు ఆ నగర మేయర్ బిల్ డె బ్లాసియో ప్రకటించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్నవారికి కృతజ్ఞతలు చెబుతున్నానని బిల్డె అన్నారు. ఆదివారం వేలాదిమంది నిరసనకారులు మ్యాన్హట్టన్లోని ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ అండ్ టవర్వైపు ప్రదర్శనగా వెళ్లారు. శాంతియుత ప్రదర్శనకు అడ్డు చెప్పకుండా పోలీసులు బారికేడ్లను తొలగించారు. న్యూయార్క్లో సోమవారం నుంచి వ్యాపార లావాదేవీలకు కొన్ని సడలింపులిచ్చారు. రిటైల్, హోల్సేల్ దుకాణాలు తెరిచేందుకు అనుమతిచ్చారు.
తయారీ, నిర్మాణరంగ పరిశ్రమల్లో ఉత్పత్తులకు అనుమతిచ్చారు. సోమవారం నాలుగు లక్షల వరకు ఉద్యోగులు పనిలో చేరనున్నట్టు అంచనా. అయితే, నిరసన ప్రదర్శనల్లో పాల్గొనే ఆందోళనకారులు కరోనా పరీక్షలు చేయించుకోవాలని న్యూయార్క్ గవర్నర్ ఆండ్య్రూ క్యోమో సూచించారు. ఆందోళనకారుల కోసం ప్రత్యేకంగా 15 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. అమెరికాలో కరోనా కేసులు అధికంగా నమోదైంది న్యూయార్క్లోనే అన్నది తెలిసిందే. శనివారం కేవలం నలుగురిని మాత్రమే అరెస్ట్ చేసినట్టు బిల్డె తెలిపారు. శుక్రవారం 2000మంది ఆందోళనకారుల్ని అరెస్ట్ చేశారు.