హైదరాబాద్: కరోనాను జయించి ఫ్లాస్మా దానం చేసిన పలువురికి సైబరాబాద్ కమిషనరేట్ లో పోలీసులు సత్కారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ టాలీవుడ్ నటుడు మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా 150 మంది ప్లాస్మా డోనర్లను చిరంజీవి, సిపి సజ్జనార్ కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా సిపి సజ్జనార్ మాట్లాడుతూ… ప్లాస్మా దానంపై అపోహలు వద్దన్నారు. ఇప్పటివరకు 400 మందికి పైగా ప్లాస్మా దానం చేశారని సిపి తెలిపారు. ప్లాస్మా ఇచ్చేవాళ్లు ఎక్కువయ్యారని, తీసుకునేవాళ్లు తగ్గారని ఆయన పేర్కొన్నారు. ప్లాస్మాదానం చేస్తే మళ్లీ కరోనా వస్తుందనుకోవడం అపోహ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ముందుండి పోరాడుతున్న పోలీసులు, డాక్టర్లు, పారిశుద్ధ్య సిబ్బందికి సిపి ధన్యవాదాలు తెలిపారు. ప్లాస్మాదానం చేసిన వారిని సత్కరించడం ఆనందంగా ఉందని సజ్జనార్ చెప్పారు.
కరోనా పరిస్థితుల్లో ప్లాస్మా అనేది సంజీవనిలా పనిచేస్తుందని చిరంజీవి అన్నారు. ప్లాస్మా దాతలకు చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. ప్లాస్మా దానంతో ఎలాంటి బ్లడ్ లాస్ జరగదని మెగాస్టార్ చెప్పారు. రెండ్రోజుల క్రితమే తన బంధువుకు కరోనా సోకిందని ఆయన తెలిపారు. స్వామినాయుడు అనే వ్యక్తి ప్లాస్మా దానం చేయడంతో ప్రాణాలతో బయటపడ్డాడని వివరించారు. ప్లాస్మాదానంపై ఎవరూ అపోహలు పెట్టుకోవద్దని చిరంజీవి చెప్పారు. తమ ఇంట్లో పనిచేసే వర్కర్స్ కూ కరోనా సోకిందని, నలుగురూ కోలుకుని ఇప్పుడు తమ ఇంట్లోనే పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కోవిడ్ బాధితులకు ప్లాస్మా ఇస్తే 99 శాంతం బతికే చాన్స్ ఉందని చిరంజీవి చెప్పారు. ఒకరి ప్లాస్మా నుంచి 30మందికి సాయం చేయవచ్చన్నారు. ప్లాస్మా తగ్గినా 48 గంటల్లో మళ్లీ తయారవుతుందని చిరంజీవి వెల్లడించారు.