విందుకు రూ. 11 వేలు ఖర్చు పెట్టించిన ఉదంతం
కొప్పల్ ( కర్ణాటక) : చెన్నదాసర సమాజం లోని దళిత కుటుంబానికి చెందిన రెండేళ్ల బాలుడు ఆలయంలో ప్రవేశించడం నేరంగా పరిగణిస్తూ ఆలయ నిర్వాహకులు రూ. 25 వేలు జరిమానా విధించిన ఉదంతం బయటపడింది. కర్ణాటక లోని కుస్తగి పోలీస్ స్టేషన్ పరిధి లోని మియాపూర్లో లక్ష్మీదేవి ఆలయం లోకి దళితుడైన రెండేళ్ల బాలుడు పూజల కోసం ప్రవేశించడం తప్పుగా ఆరోపించి ఆ కుటుంబానికి వేధింపులు ప్రారంభమయ్యాయి. రూ. 25 వేలు జరిమానా విధించారు. అంతేకాదు దోష నివృత్తి అన్నట్టు బలవంతంగా రూ. 11 వేలు ఖర్చు పెట్టించి విందు చేయించారు. 11 రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఇప్పుడు బయటపడింది. 8 మందిని పోలీసులు అదుపు లోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇంతవరకు ఐదుగురిని అరెస్టు చేశారు. దీనిపై సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీధర కొన్ని వివరాలు తెలియచేశారు. . కొన్ని నెలల క్రితం ఆ గ్రామంలో దొంగతనం జరగ్గా, ఆలయం లోకి ఒక్క పూజారి తప్ప మరెవరూ ప్రవేశించరాదని ఆలయ నిర్వాహకులు గ్రామ పెద్దలతో కలసి నిర్ణయించారు. గ్రామం తీసుకున్న నిర్ణయాన్ని విస్మరించి కొన్ని పూజలు జరిపించడానికి సెప్టెంబర్ 14 న దళిత కుటుంబం బాలుడు ఆలయంలో ప్రవేశించడం తప్పుగా ఆరోపిస్తూ గ్రామ పెద్దలు జరిమానా విధించారని ఎస్పి చెప్పారు. ఇది కుల వివక్షకు మచ్చగా మిగిలింది . కుల వివక్ష దురాచారమని చెబుతూ గ్రామ ప్రజలను చైతన్య పర్చడానికి పోలీసులు సమావేశాలు నిర్వహిస్తున్నారు.