జోహెన్నస్బర్గ్: ప్రపంచ క్రికెట్లో విరాట్ కోహ్లి, దక్షిణాఫ్రికా దిగ్గజం ఎబి డివిలియర్స్లకు ప్రాణ స్నేహితులుగా పేరుంది. అయితే డివిలియర్స్ మాత్రం తన అప్తమిత్రుడు కోహ్లికి అనూహ్య షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ పోటీలు నిలిచి పోవడంతో లభించిన ఖాళీ సమయాన్ని క్రికెటర్లు తమకు తోచిన విధంగా మలుచుకుంటున్నారు. కొందరూ టిక్టాక్ వీడియోలు నిర్వహిస్తుండగా మరికొందరూ ఇన్స్టా లైవ్షోల ద్వారా అభిమానులతో తమ అనుభవాలను పంచుకుంటున్నారు. మరికొందరూ క్రికెటర్లు మాత్రం తమ అభిమాన జట్లను ఎంపిక చేస్తూ బీజీగా ఉంటున్నారు. తాజాగా దక్షిణాఫ్రికా దిగ్గజం, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు స్టార్ ఆటగాడు డివిలియర్స్ కూడా తన అత్యుత్తమ ఐపిఎల్ ఎలెవన్ జట్టును ప్రకటించాడు. అయితే తన జట్టు కెప్టెన్గా విరాట్ కోహ్లిని కాదని చెన్నై సూపర్కింగ్స్ స్టార్ మహేంద్ర సింగ్ ధోనీకి సారథ్య బాధ్యతలు అప్పగించాడు. ఒక మాటలో చెప్పాలంటే డివిలియర్స్ ఈ క్రమంలో తాను ప్రాతినిథ్యం వహిస్తున్న బెంగళూరు జట్టు కెప్టెన్ కోహ్లికి షాక్ ఇచ్చాడనే చెప్పాలి.
అయితే, డివిలియర్స్ మాత్రం జట్టు ఎంపికలో స్నేహాన్ని పక్కనబెట్టి ప్రతిభకే ప్రాధాన్యత ఇచ్చిన విషయం స్పష్టమవుతోంది. డివిలియర్స్ ఆల్టైమ్ గ్రేట్ ఐపిఎల్ జట్టులో భారత క్రికెటర్లకే ప్రాధాన్యత ఇచ్చాడు. ఊహించని విధంగా ఓపెనర్గా వీరేంద్ర సెహ్వాగ్ను ఎంపిక చేశాడు. మరో ఓపెనర్గా రోహిత్ శర్మకు అవకాశం ఇచ్చాడు. మూడో స్థానంలో బ్యాటింగ్కు దిగే ఛాన్స్ను విరాట్కు అప్పగించాడు. నాలుగో నంబర్లో డివిలియర్స్ బరిలోకి దిగాడు. ఆల్రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా, బెన్స్టోక్స్లకు అవకాశం కల్పించాడు. మరోవైపు కెప్టెన్సీతో పాటు వికెట్ కీపింగ్ బాధ్యతలను మహేంద్ర సింగ్ ధోనీకి అప్పగించాడు. అంతేగాక స్పెసలిస్ట్ స్పిన్నర్గా అఫ్గాన్ సంచలనం రషీద్ ఖాన్ను ఎంపిక చేశాడు. ఇక ఫాస్ట్ బౌలర్లుగా భారత స్టార్లు భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రాలకు చోటు కల్పించాడు. అంతేగాక మూడో బౌలర్గా దక్షిణాఫ్రికా స్టార్ కగిసో రబడాను ఎంపిక చేశాడు. ఇక, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, న్యూజిలాండ్, శ్రీలంక తదితర జట్ల ఆటగాళ్లకు డివిలియర్స్ తన జట్టులో చోటు కల్పించలేదు.
De villiers announced his best IPL XI with Dhoni Captain