మన తెలంగాణ/ కుత్బుల్లాపూర్: దుండిగల్ మున్సిపల్ పరిధిలోని భౌరంపేట గ్రామానికి చెందిన పలుపునూరి మల్లారెడ్డి భార్య పవిత్ర(33) చనిపోతూ మరో ఆరుగురికి ప్రాణదానం చేశారు. వివరాల్లోకి వెళితే… ఈ నెల 26న జరిగిన రోడ్డు ప్రమాదంలో భౌరంపేట గ్రామానికి చెందిన పవిత్ర తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో చికిత్స నిమిత్తం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఆమె రెండు రోజుల తరువాత బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు కుటుంబ సభ్యులకు తెలిపారు. జీవన్దాన్ ప్రతినిధులు మృతురాలి కుటుంబ సభ్యులను కలిసి అవయవదానం గురించి అవగాహన కల్పించారు. దీంతో పుట్టెడు దుఃఖంలో కూడా మల్లారెడ్డి కుటుంబ సభ్యులు అవయవదానం చేసెందుకు ఒప్పుకున్నారు.
వెంటనే సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తికి గుండె మార్పిడి చేయాలని నిర్ణయించారు. గురువారం నగర కమిషనర్ అనిల్కుమార్ ఆదేశాల మేరకు మహంకాళి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్తయ్య నేతృత్వంలో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి గుండెను తరలించారు. ఉపిరితిత్తులు, కాలేయం, ఒక కిడ్నీని యశోద ఆసుపత్రిలో ఉన్న రోగులకు అమర్చగా, మరో కిడ్నీ, కార్నియాలను ఇతర ఆసుపత్రిలో ఉన్న రోగులకు అమర్చారు. దీంతో అవయవదానానికి ఒప్పుకున్న కుటుంబ సభ్యులకు వైద్యులు, అవయవాలు స్వీకరించిన రోగుల కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Dead Woman Pavithra’s Organs Donated in Hyd