హైదరాబాద్: రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ అధీనంలోని ఐటిడిఎల పరిధిలో బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి గుర్తింపు ప్రక్రియను పూర్తి చేశారు. ఇటీవల రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన జరిగిన 6వ గిరిజన సంక్షేమ సలహా మండలి సమావేశంలో ఐటిడిఎ పరిధిలోని బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి ఏకగ్రీవంగా తీర్మానం అమోదించారు. మరో వైపు ప్రభుత్వం బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి 31మార్చి వరకు గడువు పెంచుతూ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఐటిడిఎ భద్రాచలం, ఐటిడిఎ ఎటూరు నాగారం, ఐటిడిఎ ఉట్నూరు పరిధిలో 15 శాఖల వారిగా బ్యాక్ లాగ్ ఉద్యోగాల గుర్తింపు ప్రక్రియను ఖారారు చేశారు.
ఇప్పటిదాక 11,886 ఉద్యోగాలు మంజూరు చేయగా, 8,479 ఉద్యోగాలను భర్తీ చేశారు. ఇందులో 3,407 ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉందని గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్న ఐటిడిఎల పరిధిలో అత్యంత ప్రధానంగా వైద్య, విద్య, అటవి, రెవెన్యూ, పంచాయితీరాజ్, వ్యవసాయం తదితర శాఖ పరిధిలో బ్యాక్లాగ్ ఉద్యోగాలను గుర్తిచారు. ఇందులో ఐటిడిఎ భద్రాచాలం పరిధిలోని 3,033 ఉద్యోగాలను మంజూరు చేయగా, 2,128 ఉద్యోగాలను భర్తీ చేశారు. ఇక్కడ 905 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
ఐటిడిఎ ఎటూరు నాగారం పరిధిలో 1,651 ఉద్యోగాలు మంజూరు చేయగా, 1,199 ఉద్యోగాలను భర్తీ చేశారు. ఇంకా452 ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉంది. ఐటిడిఎ ఉట్నూరులో 7,079 ఉద్యోగాలను మంజూరు చేయగా, 5,042 ఉద్యోగాలను భర్తీ చేశారు. 2,037 ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉంది. ఐటిడిఎ మన్నూర్లో 123 ఉద్యోగాలను మంజూరు చేయగా, 110 ఉద్యోగాలను భర్తీ చేశారు. 13 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలల్లో ప్రాధాన్యతల వారీగా బ్యాక్ లాగ్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి శాఖపరమైన కసరత్తు ప్రారంభిస్తారని అధికార వర్గాలు పేర్కొంటున్నారు.