నవంబర్ 1 నుంచి తరగతులు ప్రారంభం..?
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఈ నెలాఖరు వరకు డిగ్రీ ప్రవేశాలు పూర్తి కానున్నాయి. ఇప్పటికే రెండు విడతల దోస్త్ కౌన్సెలింగ్ పూర్తి కాగా, మూడవ విడత వెబ్ ఆప్షన్లు ముగియగా, ఈ నెల 15వ తేదీన సీట్లు కేటాయించనున్నారు. అదే రోజు నుంచి దోస్త్ ప్రత్యేక విడత రిజిస్ట్రేషన్లు ప్రారంభించనున్నారు. ప్రత్యేక విడత దోస్త్ కౌన్సెలింగ్లో భాగంగా ఈ నెల 15 నుంచి 26 వరకు రిజిస్ట్రేషన్లు, 27 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించి, ఈ నెల 30న సీట్లను కేటాయించనున్నారు. మొదటి విడత, రెండవ విడత దోస్త్ కౌన్సెలింగ్లో సీట్లు పొందిన 1,55,016 మంది విద్యార్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా తమ సీట్లను రిజర్వు చేసుకోగా, దోస్త్ మూడవ విడతలో 32,264 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) నవంబర్ 1 నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ముందుగా ఆన్లైన్ తరగతులను ప్రారంభించి ఆ తర్వాత పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులను కళాశాలలకు అనుమతిచ్చే విషయం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. అక్టోబర్ 31 నాటికి ప్రవేశాల ప్రక్రియ పూర్తి చేయాలని పూర్తి చేసి, ఆయా విద్యాసంస్థలు ఖాళీగా మిగిలిన సీట్లను నవంబర్ 30 వరకు భర్తీ చేసుకునేందుకు యుజిసి అవకాశం కల్పించాలని యుజిసి తెలిపింది. ఆ మేరకు షెడ్యూల్ ప్రకారం ప్రక్రియ పూర్తి చేసేందుకు దోస్త్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.