Thursday, April 25, 2024

సిట్ విచారణతో గల్లీ నుంచి ఢిల్లీ దాకా బిజెపి నాయకుల్లో వణుకు

- Advertisement -
- Advertisement -

త్వరలోనే అసలు దొంగల బండారం బయటపడుతది
నంబర్ 2 ఆదేశాలతోనే కోర్టుల చుట్టూ రాష్ట్ర బిజెపి నాయకుల చక్కర్లు
తప్పు చేసిన బిజెపి నాయకులు శిక్ష అనుభవించక తప్పదు
వారిని దేవుడు కూడా కాపాడలేడు
టిఎస్ రెడ్‌కో చైర్మన్ సతీష్ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్:  ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబిఐకి అప్పగించాలన్న బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి పిటీషన్‌ను హైకోర్టు కొట్టేయడంపై రాష్ట్ర టిఎస్ రెడ్‌కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కొనసాగించాలని కోర్టు సూచించడంతో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వెనక ఉన్న అసలు నిందితులెవరో బట్టబయలు కాబోతోందని సతీష్ రెడ్డి పేర్కొన్నారు. సిట్ విచారణతో గల్లీ నుంచి ఢిల్లీ దాకా బిజెపిలో వణుకు మొదలైందన్నారు. ఈ కేసులో బిజెపి నాయకుల హడావుడితోనే టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించింది వారేనని స్పష్టమైందన్నారు. ఓ వైపు ఎమ్మెల్యేల కొనుగోలుతో సంబంధం లేదంటూనే ఏకంగా బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి ఈ కేసును సీబిఐకి అప్పగించాలని హైకోర్టులో పిటీషన్ ఎందుకు వేశారని సతీష్ రెడ్డి ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణ చేస్తే తమ పార్టీకి చెందిన జాతీయ స్థాయిలోని ముఖ్యనాయకుల బండారం బయటపడుతుందన్న భయంతోనే ప్రేమేందర్ రెడ్డి కోర్టులో పిటీషన్ వేశారని, ఆ పార్టీ నేతలు సుప్రీంకోర్టు వరకు వెళ్లారని సతీష్‌రెడ్డి ఆరోపించారు. సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టినా వారికి బుద్ధి రాలేదని ఆయన ఎద్దేవా చేశారు. ముఖ్యనేతల బండారం ఎక్కడ బయటపడుతుందోనని బిజెపి నాయకులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని సతీష్‌రెడ్డి ఆరోపించారు. పూర్తిగా నంబర్.2 డైరెక్షన్‌లోనే రాష్ట్ర బిజెపి నాయకులు పనిచేస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చేందుకు బిజెపి చేసిన కుట్రలన్నీ సిట్ విచారణలో బహిర్గతం కాబోతున్నాయని సతీష్ రెడ్డి పేర్కొన్నారు. తప్పు చేసిన బిజెపి నాయకులు శిక్ష అనుభవించక తప్పదని, వారిని దేవుడు కూడా కాపాడలేడని సతీష్ రెడ్డి అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News