Friday, April 19, 2024

సిసోడియా కస్టడీ 23 వరకూ పొడిగింపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో జైలులో ఉన్న ఆప్ సీనియర్ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు తిరిగి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన జుడిషియల్ కస్టడీని స్థానిక ఢిల్లీ కోర్టు ఈ నెల 23 వరకూ పొడిగించింది. అంతకు ముందటి కస్టడీ గడువు సోమవారం ముగియడంతో ఆప్ నేతను కోర్టు ఎదుట సోమవారం ప్రవేశపెట్టారు. కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అదనపు ఛార్జీషీటును దాఖలు చేసిందని, ఇది ఈ నెల 10న పరిశీలనకు రానుందని, ఈ దశలో నిందితుడికి బెయిల్ శ్రేయస్కరం కాదని సంస్థ తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్‌కె మట్టా తెలిపారు. సంబంధిత వివరాలను కోర్టుకు సమర్పించారు. దీనితో కస్డడీని పొడిగించాలని ప్రత్యేక న్యాయమూర్తి ఎంకె నాగ్‌పాల్ ఆదేశించారు.

దీనితో మరో పదిరోజుల పాటు సిసోడియా జైలులోనే ఉండాల్సి ఉంటుంది. అంతకు ముందు కోర్టు స్పందిస్తూ నిందితుడి బెయిల్ దరఖాస్తును ఆమోదించడం కుదరదని, ఆర్థిక నేరాల కేసు సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం పడేలా చేస్తుందని తెలిపింది. పైగా ఇప్పుడు ఈ కేసులో జరిగిందని చెపుతున్న నేరంలో ఈ నిందితుడు కమిషన్లు పొందడాన్ని నిరూపించే భారీ స్థాయి సాక్షాధారాలు ఉన్నాయని స్పష్టం అవుతున్నందున దీనికే తాము ప్రాధాన్యత ఇస్తామని న్యాయమూర్తి తెలిపారు. లిక్కర్ స్కామ్‌లో సిసోడియాను ఇడి మార్చి 9వ తేదీన అరెస్టు చేసింది. సంబంధిత కేసులోనే సిబిఐ అంతకు ముందు సిసోడియాను అరెస్టు చేసింది. ఏకకాలంలో సిసోడియా ఈ రెండు దర్యాప్తు సంస్థల అరెస్టులు తరువాతి కస్టడీలను ఎదుర్కొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News