న్యూఢిల్లీ: నిర్భయ హత్యాచారం కేసులో నలుగురు దోషులకు ఈ నెల 22న ఉరిశిక్షను ఢిల్లీ కోర్టు వాయిదా వేసింది. దోషులలో ఒకడు క్షమాభిక్ష పిటిషన్ వేయడంతో తీస్ హజారీ కోర్టు గురువారం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. మరణశిక్షపై తాము గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించడం లేదని, ఒక క్షమాభిక్ష పిటిషన్ దాఖలైనందున ఉరిశిక్ష అమలుపై స్టే ఉంటుందని న్యాయమూర్తి చెప్పారు. ముకేష్ సింగ్ అనే దోషి క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేయడంతో జనవరి 22న ఒకేసారి నలుగురు దోషులకు ఉరిశిక్ష ఉండబోదని ఢిల్లీ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. దోషులు ముకేష్ సింగ్(32), వినయ్ శర్మ(26), అక్షయ్ కుమార్ సింగ్(31), పవన్ గుప్తా(25)లను జనవరి 22వ తేదీ ఉదయం 7 గంటలకు తీహార్ జైలులో ఉరి తీయాలని జనవరి 7వ తేదీన తీస్ హజారీ కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ఇదిలా ఉండగా నిర్భయ తల్లిదండ్రుల తరఫున కోర్టులో న్యాయవాది సీమా కుష్వాహ వాదిస్తూ రాష్ట్రపతి ఎదుట క్షమాభిక్ష ఏదీ పెండింగ్లో లేదని తెలిపారు. క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేయడం మాత్రమే జరిగిందని, అది రాష్ట్రపతికి పంపారో లేదో కూడా తెలియదని ఆమె వాదించారు. ఈ పిటిషన్ కారణంగా ఉరిశిక్షపై స్టే ఇవ్వడం సరికాదని ఆమె అన్నారు.