న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండు చేస్తూ ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల కాలంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రైతులు ప్రదర్శనలు నిర్వహించడానికి ఢిల్లీ పోలీసులు బుధవారం అనుమతి ఇచ్చారు. పోలీసు ఎస్కార్టుతో రైతులు సింఘూ సరిహద్దుల నుంచి జంతర్ మంతర్కు బస్సులలో ప్రయాణించడానికి అనుమతి పోలీసులు అనుమతి ఇచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ నెల 19న ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 13న ముగియనున్నాయి.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో జంతర్ మంతర్ వద్ద కిసాన్ పార్లమెంట్ నిర్వహిస్తామని, జులై 22 నుంచి ప్రతిరోజు 200 మంది నిరసనకారులు సింఘూ సరిహద్దుల నుంచి హాజరవుతారని రైతు సంఘాలు మంగళవారం ప్రకటించాయి. మంగళవారం ఢిల్లీ పోలీసు అధికారులను కలుసుకున్న అనంతరం రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండు చేస్తూ జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ప్రదర్శనలు నిర్వహిస్తామని, నిరసనకారులెవరూ పార్లమెంట్ వైపు వెళ్లబోరని తెలిపారు.