ఎన్ఎస్ఎ అజిత్ దోవల్ హామీ
అల్లర్ల ప్రాంతాల్లో అధికారులతో అర్ధరాత్రి పర్యటన
పోలీసుల విధి నిర్వహణకు ప్రశంసలు
న్యూఢిల్లీ : ఈశాన్య ఢిల్లీలో పరిస్థితి అదుపులో ఉందని, పోలీసులు తమ విధుల్ని సక్రమంగా నిర్వర్తిస్తున్నారని జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఎ) అజిత్ దోవల్ అన్నారు. ఘర్షణలతో అట్టుడుకుతున్న ఢిల్లీలో సాధారణ పరిస్థితిని నెలకొ ల్పే బాధ్యతను డోవల్కు అప్పగించారు. ‘జరిగిందేదో జరిగిం ది. పూర్తి ప్రశాంతత నెలకొంటుంది’ అని డోవల్ ఆశాభావం వ్యక్తం చేశారు. అల్లర్లు జరిగిన ఈశాన్య ఢిల్లీలోని ప్రాంతాల్లో బుధవారం ఆయన పర్యటించి, స్థానికుల్ని కలుసుకున్నారు. 24 గంటల్లో ఆయన ఈ ప్రాంతాల్లో పర్యటించడం ఇది రెండోసారి. ఒక చిన్న బాలిక ఆయన దగ్గరికి వచ్చి తనకు అక్కడ భద్రత లేదని భయపడుతూ చెప్పింది. దుండగులు రెచ్చిపోయి హింసాకాండను సాగిస్తుంటే పోలీసులు చూస్తూ ఉన్నారని ఆ అమ్మాయి ఆరోపించింది. ‘నేను మాటిస్తున్నాను. ఇక్కడ అందరూ సేఫ్టీగా ఉంటారు’ అని డోవల్ ఆమెకు హామీ ఇచ్చారు. ఆ పిల్ల సురక్షితంగా ఇల్లు చేరేలా చూడమని పోలీసులను డోవల్ ఆదేశించారు. ‘ప్రజల్లో ఐక్యతా భావం ఉంది. వారిమధ్య శత్రుత్వం లేదు. కొందరు నేరస్థులు వారిని వేరుపరిచేందుకు ఇలాంటి పనులు చేస్తుంటారు. ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు తను అక్కడికి వచ్చానని డోవల్ తెలిపారు. ‘పరిస్థితి అదుపులో ఉంది. ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. శాంతి పరిరక్షణ దళాలపై మాకు నమ్మకముంది. పోలీసులు చాలా శ్రమిస్తున్నారు. కొందరు క్రిమినల్స్ వీటికి పాల్పడుతున్నారు. సమస్యల్ని పరిష్కరించేందుకు అందరూ ప్రయత్నించాలి. ఇంతకు ముందు అల్లర్లు జరిగాయి. కానీ ఇప్పుడు ప్రశాంతంగా ఉంది’ అన్నారాయన. అంతకు ముందు డోవల్ సీలంపూర్లో డిప్యూటీ కమిషనర్ ఆఫీసులో ఢిల్లీ పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశమై ఘర్షణలపై సమీక్షించారు. ఎసిపి (క్రైమ్) మందీప్ సింగ్ రణధావా, కొత్తగా నియమించబడిన స్పెషల్ సిపి ఎన్ ఎన్ శ్రీవాత్సవ, స్పెషల్ సిపి (శాంతి భద్రతలు) సతీష్ గోల్చా, డిసిపి (ఈశాన్య ఢిల్లీ) వేద్ ప్రకాష్ ఆర్య ఈ సమావేశానికి హాజరయ్యారు.
అర్ధరాత్రి పర్యటన
మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఆయన ఢిల్లీ పోలీస్ కమిషనర్ అమూల్య పట్నాయక్, కొత్తగా స్పెషల్ కమిషనర్గా నియమితులైన ఎన్.ఎన్. శ్రీవాత్సవతో కలిసి వివిధ ప్రాంతాల్లో తిరిగారు. కొన్నిచోట్ల ఆయనకు ఆదరణపూర్వకమైన స్వాగతం లభించగా, ఒకచోట మాత్రం ఆగ్రహించిన ఇద్దరు జరిగిన హింస గురించి డోవల్కు ఫిర్యాదు చేశారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పర్యటనలో ఉండగా రగిలిన హింసను అదుపు చేయడంలో విఫలమైనందుకు డోవల్ …పట్నాయక్, శ్రీవాత్సవలను మందలించినట్టు తెలిసింది.
Delhi Violence: Ajit Doval visits riot hit areas in East Delhi