ప్రపంచ ఆరోగ్య సంస్థ వారాంతపు నివేదిక
న్యూయార్క్ : భారత్ లోని కొవిడ్ బాధితుల్లో వేర్వేరు వయస్సులున్న వారిపై చేపట్టిన అధ్యయనంలో 19 ఏళ్ల లోపు వారిలోను, మహిళల్లోను ఇన్ఫెక్షన్ కేసులు అత్యధికంగా పెరిగినట్టు బయటపడింది. మామూలు కొవిడ్ కేసులు కన్నా డెల్టా వేరియంట్ కేసుల్లో మరణాల రేటు ఎక్కువగా ఉండడమే కాకుండా, ఇన్ఫెక్షన్లు కూడా ఎత్కువగా ఉన్నాయని అధ్యయనం వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్ఒ) కొవిడ్ కేసుల వారపు నివేదికను ఈవారం విడుదల చేసింది. ఈ క్రాస్ సెక్షనల్ అధ్యయనం అంత లోతుగా ఇంకా సమీక్షించ లేదు. ఈ అధ్యయనం తీవ్ర అస్వస్థత, మరణాల రేటు ప్రధానంగా తీసుకుని జనాభా లక్షణాలను సమీక్షించింది.
భారత్లో వేరియంట్ కాని బి.1, వేరియంట్ , డెల్టా వేరియంట్ వల్ల సంభవించిన కొవిడ్ కేసులతో పోల్చి ఈ అధ్యయనం నిర్వహించింది. 9500 కొవిడ్ రోగుల వైరల్ జన్యు సరళిని విశ్లేషించింది. 19 ఏళ్ల లోపు వారి లోను, మహిళల్లోను కొవిడ్ కేసులు తీవ్రంగా పెరిగాయని, కొవిడ్ లక్షణాలతో తీవ్ర అస్వస్థత, ఆస్పత్రిపాలు కావడం, ఎక్కువ శాతం మరణాలు, వ్యాక్సినేషన్ పొందినప్పటికీ డెల్టా వేరియంట్ వల్ల బాధితులు కావడం, తదితర కేసులను వేరియంట్ కాని బి.1 కేసులతో పోల్చి చూశారు. ప్రపంచం మొత్తం మీద ఆగస్టు నుంచి వారం వారీ కొవిడ్ కేసులు , మరణాలు తగ్గుముఖం పడుతున్నాయని అధ్యయనం వివరించింది. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 3 వరకు 3.1 మిలియన్ కొత్త కేసులు, అలాగే కొత్తగా 54,000 మరణాలు సంభవించాయని పేర్కొంది.