అమరావతి: టిడిపి మహానాడు తీర్మానాలపై వైసిపి ఎంఎల్ఎ రోజా మండిపడ్డారు. మహానాడులో మాజీ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తీర్మానాలు చూసి జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పదవి కోసం దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టిఆర్ను బాబు వెన్నుపోటు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎపిలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని తీర్మానం పెట్టడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. చంద్రబాబు తన పాలనలో వైసిసి ఎంఎల్ఎలను కొని… అందులో నలుగురిని మంత్రులను చేశారని, అప్పుడు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన విషయాన్ని బాబూ మర్చిపోయారా? అని చురకలంటించారు. ప్రజలు తిరస్కరించినా… చంద్రబాబులో మార్పురాలేదని ధ్వజమెత్తారు. రైతులకు, మహిళలకు సిఎం జగన్ చేసిన మేలు ఎవరూ చేయలేదని, ఏడాదిలోనే పది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసిన ఘనత సిఎం జగన్కు దక్కుతుందని, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలనను అన్ని రాష్ట్రాల సిఎంలు ప్రశంసిస్తున్నారని రోజా మెచ్చుకున్నారు.