హైదరాబాద్ : భద్రాద్రి సీతారాముల కల్యాణానికి దేశ వ్యాప్తంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతుంటారు. ముందుగానే కల్యాణం టికెట్లు బుకింగ్ జరుగుతుంటుంది. కానీ ఈసారి రామయ్య కల్యాణాన్ని తిలకించే అదృష్టం భక్తులకు లేదు. భద్రాద్రిలో ఏప్రిల్ 2న జరగనున్న శ్రీరామ నవమి వేడుకలకు కరోనా భయం పట్టుకున్న నేపథ్యంలో స్వామివారి కల్యాణానికి ఎవరినీ అనుమతించట్లేదని, భక్తులెవరూ రావొద్దని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో కొనసాగుతున్న కరోనా అలర్ట్ నేపథ్యంలో భక్తులు లేకుండానే శ్రీరామనవమి జరుపుతామని మంత్రి పువ్వాడ అజయ్ పేర్కొన్నారు. మంగళవారం ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మంత్రి పువ్వాడ ఈ మేరకు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. కేవలం అర్చకులు మాత్రమే శాస్త్రోక్తంగా కల్యాణ క్రతువును నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు.
ప్రభుత్వ సలహాదారు రమణాచారికి కల్యాణ బాధ్యతలు
ఈ నేపథ్యంలోనే శ్రీ రాములవారి కల్యాణం టికెట్లు రద్దు చేస్తున్నామని ఆయన ప్రకటించారు. టికెట్ డబ్బు తిరిగి ఆలయ అధికారులు చెల్లిస్తారని, కరోనాపై ప్రజలు భయభ్రాంతులకు గురికావొద్దని, మరింత అప్రమత్తంగా ఉండాలని ఉండాలని ఆయన సూచించారు. రామయ్య కల్యాణం బాధ్యతలను ఈసారి ప్రభుత్వ సలహాదారు రమణాచారికి అప్పగించారు. రామయ్య కల్యాణ మహోత్సవంలో భాగంగా ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తరుఫున తీసుకొచ్చే పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు ఈసారి ఎవరు తీసుకు వస్తారనే దానిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కల్యాణం టిక్కెట్ల అమ్మకాలను పూర్తిగా నిలిపివేశారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని స్కూల్స్, థియేటర్స్ మూతపడగా దేవాలయాలపై కూడా ఈ ప్రభావం పడడం గమన్హారం.