మాంసం, మందుతో భక్తుల పూజలు
పెద్దలకు పిండ ప్రదానం
అంట్లు తీర్చుకోవడం ఇక్కడి ప్రత్యేకత
తీర్థాల సంగమేశ్వర ఆలయ జాతర విశిష్టత
ఏళ్ళతరబడిగా వింత అచారం
మన తెలంగాణ/ఖమ్మం ప్రతినిధి : మహా శివరాత్రి అనగానే ఉపవాసం ఉండి జాగారం చేయడం అనేది అందరికీ తెలుసు కానీ ఖమ్మం రూరల్ మండలం తీర్థాలలోని సంగమేశ్వర ఆలయ జాతరలో మాత్రం భక్తులు మంసాహారం, మందుతో ప్రత్యేక పూజలు చేయడం గత కొన్ని దశాబ్ధాల నుంచి ఆనవాయితీగా వస్తుంది. ఉమ్మడి జిల్లాలో శైవ ఆలయాల్లో ఎక్కడ లేని విధంగా ఇక్కడ మాత్రమే మందు, మాంసంతో పూజలు చేసుకోవడం ఇక్కడి విశిష్టతగా చెప్పుకోవచ్చు. ఖమ్మం నగరానికి 15 కిమీ దూరంలో తీర్థాల గ్రామంలో ఆకేరు, మున్నేరు, బుగ్గేరు ఉప నదుల కలిసే చోట వెలిసిన సంగమేశ్వరుని ఆలయం వద్ద ప్రతిఏటా మహా శివరాత్రి సందర్భంగా ఐదు రోజుల పాటు ఈ జాతర కొనసాగుతుంది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల నుంచి లక్షకు పైగా ఈ జాతరకు భక్తులు తరలివస్తారు. అయితే 12 ఏళ్ళకోసారి వచ్చే పుష్కరాల మాదిరిగా ఈ జాతరకు వచ్చే భక్తులు తమ బంధువులు చనిపోతే ఇక్కడ పుణ్యనదిలో స్నానం చేసి పిండ ప్రధానం చేసి అంట్లు తీర్చుకోవడం, మరణించిన పెద్దలకు తర్పణం వదలటం, బంధు మిత్రులను పిలిపించి మేకలను, కోళ్ళను వధించి మాసంంతో సహపంక్తి భోజనాలను వడ్డిస్తారు.
కార్తీక మాసంలో జరిగే వనభోజనాలను తలపించే విధంగా ఇక్కడ మాంసంతో భోజనాలు తయారు చేసి బంధుమిత్రులకు వడ్డిస్తారు. త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం ఆచరిస్తే కొరిన కోర్కెలు తీరుతాయనే నమ్మకం భక్తుల్లో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఏ శైవ క్షేత్రాల్లో కన్పించని వింత అచారం ఇక్కడ కన్పిస్తుంది. మేడారం, గొల్లగట్ట పెద్ద జాతర మాదిరిగా ఇక్కడ మేకలు, గొర్రెలు, కోళ్ళు తెగిపడుతాయి. తేత్రాయుగంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి శివపార్వతులు సప్తరుషులతో కలిసి వచ్చారని తిరుగు ప్రయాణంలో శివపార్వతులు ఈప్రాంతంలోని మూడు నదుల సంగమం వద్ద సేద తీరారనే నానుడి ఇక్కడ ప్రచారంలో ఉంది. ఈ ప్రాంతంలో ముగ్గరు త్రీమూర్తులు భృంగి మహారుషి, ఆత్రయే మహారుషి, మొద్గాలియ మహారుషిలు ఈ ప్రాంతంలో పర్యటించారని త్రిలింగా ఆకారంలో శివ పార్వతులు విగ్రహాలుగా మారారని స్థానికులు చెబుతున్నారు. మహా శివరాత్రి రోజు రాత్రి 12 గంటలకు స్వామి వారి కళ్యాణం నిర్వహిస్తారు. ఈ ఆలయాన్ని 600 ఏళ్ళ క్రితం నిర్మించారు.