న్యూఢిల్లీః విమానాల్లో మధ్య సీట్లను ఖాళీగా వదిలేయాలని ఎయిర్ లైన్స్ సంస్థలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డిజిసిఎ) ఆదేశించింది. ఓవేళ విమానయాన సంస్థలు మధ్య సీట్లను కూడా ప్రయాణికులతో నింపాలనుకుంటే వారికి జౌళి మంత్రిత్వశాఖ ప్రామాణికతలకు అనుగుణంగా రక్షణ గౌన్లు ఏర్పాటు చేయాలని సూచించింది. దీనికి తోడు మూడు పొరల ఫేస్ మాస్క్, ఫేస్ షీల్డ్ కూడా తప్పనిసరని తెలిపింది. ఓ పిటిషన్పై విచారణ సందర్భంగా మే 25న సుప్రీంకోర్టు సూచనకనుగుణంగా డిజిసిఎ సోమవారం ఈ ఆదేశాలు జారీ చేసింది.
అయితే, ఒకే కుటుంబానికి చెందినవారికి ఈ విషయంలో మినహాయింపు ఇవ్వొచ్చని తెలిపింది. వరుస లాక్డౌన్లతో రెండు నెలల విరామం తర్వాత మే 25నుంచి దేశీయ విమానాలను నడిపేందుకు కేంద్రం అనుమతిచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం విమాన ప్రయాణికుల సంఖ్య మొత్తం సీట్లకు దాదాపు సగం మేరకే ఉండటంతో ఎయిర్లైన్స్ సంస్థలకు ఇబ్బందేమీ లేదని భావిస్తున్నారు.
DGCA tells Airlines to Keep Middle Seats Empty in Flights