Thursday, March 28, 2024

మావోయిస్టు కదలికలపై నిరంతరం అప్రమత్తత అవసరం: డిజిపి అంజనీ కుమార్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఏ ఒక్క చిన్న సంఘటన జరిగినా అది తెలంగాణా రాష్ట్ర అభివృద్ధిపై తీవ్ర ప్రభావం కనబరుస్తుందని, ఈపరిస్థితుల్లో పోలీస్ అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని డిజిపి అంజనీ కుమార్ పేర్కొన్నారు. ఇటీవల దక్షిణ బస్తర్‌లోని అరుణపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఏప్రిల్ 26న జరిగిన మందుపాతర పేలుడులో 10 మంది భద్రతా సిబ్బందితో పాటు ఒక పౌరుడు మరణించిన సంఘటన నేపథ్యంలో రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల పోలీస్ అధికారులతో డిజిపి గురువారం తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫ రెన్స్ ద్వారా వర్క్‌షాప్ నిర్వహించారు.

ఈ వర్క్‌షాప్‌లో అడిషినల్ డిజి గ్రేహౌండ్స్ విజయ్ కుమార్, అడిషినల్ డిజి సంజయ్ కుమార్ జైన్, ఐజి ఎస్‌ఐబి ప్రభాకరరావు, ఐజిలు చంద్రశేఖర్‌రెడ్డి, షానవాజ్ ఖాసిం ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డిజిపి అంజనీ కుమార్ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ ప్రముఖులు, వివిఐపిల పర్యటన సమయంలో భద్రతా బలగాలు సంచరించే సమయంలో భద్రతా పరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇదే సమయంలో రాష్ట్రాల సరిహద్దుల ప్రాంతాల్లో మావోయిస్టుల యాక్షన్ టీంల కదలికలు పెరిగే అవకాశం ఉందని, ఆ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు డిజిపి సూచించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఐటి పరిశ్రమలు, అనేక బహుళజాతి సంస్థలు హైదరాబాద్ కేంద్రంగా తమ కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నాయన్నారు. మావోయిస్టులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని, ఒకర్ని దెబ్బతీయడం వల్ల వేలది మందిని భయభ్రాంతులకు గురిచేసేలా వ్యవహరిస్తున్నారన్నారు.

కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. తెలంగాణలో వామపక్ష తీవ్రవాదం పూర్తిగా అంతరించిపోయిందని దీనికి పోలీస్ శాఖ నిరంతర కృషే కారణమన్నారు. మావోయిస్టు చర్యలకు సంబంధించిన కీలక దాడుల్ని ఈ సందర్భంగా డిజిపి అధికారులకు వివరించారు. రాష్ట్రంలో 80 శాతం కొత్తగా విధుల్లో చేరిన పోలీ సులు ఉండటం వల్ల మావోయిస్టు వ్యూహాలు, చర్యలు, దాడులపై మరింత అవగాహన ఏర్పరచుకోవాలని తెలిపారు. అదనపు డిజిపి (ఆపరేషన్స్) విజయ్ కుమార్ మాట్లాడుతూ పోలీసు దళాల కదలికల్లో మార్పులు, వ్యూహాల్ని ఎప్పటికప్పుడు మారుస్తుండాలన్నారు. విఐపిల వద్ద ఉండే పిఎస్ ఒలకు మావోయిస్టులు జరిపే ఆకస్మిక దాడులు అనుకోని పరిస్థితులు ఏర్పడితే భద్రత కల్పించే అంశంపై ప్రత్యేక శిక్షణ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఐజి ప్రభాకర్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలో తీవ్రవాదం పరిస్థితి, పోలీస్ తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమగ్రంగా వివరించారు. గ్రామస్థాయి ప్రజలతో నిరంతరం మమేకమై మావోయిస్టులు, కొత్తవారి కదలికలపై సమాచారం సేకరించాల న్నారు. మరీ ముఖ్యంగా సరిహద్దు గ్రామాల పోలీసులు ఈ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ వర్క్‌షాప్‌లో అన్ని యూనిట్ల అధికారులు, సరిహద్దు ప్రాంత డిఎస్‌పిలు పాల్గొన్నారు.

Also Read: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిజెపిలో చేరనున్నారా..?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News