Thursday, April 25, 2024

కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయాలి: హైకోర్టు

- Advertisement -
- Advertisement -
DH Srinivasa Rao Submit Report To High Court On Covid Situation
కోర్టుకు నివేదిక సమర్పించిన డిహెచ్ శ్రీనివాసరావు

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని జిహెచ్ ఎంసి అధికారులు, పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో కరోన పరిస్థితులు, ప్రభుత్వ చర్యలపై ఉన్నత న్యాయస్థానం మంగళవారం నాడు విచారణ జరిపింది. రాష్ట్రంలో కరోనా కట్టడి చర్యలపై డిహెచ్ శ్రీనివాసరావు నివేదిక ధర్మాసనానికి అందజేశారు. అయితే ప్రభుత్వం తప్పుడు గణాంకాలు సమర్పిస్తోందని పిటిషనర్ల తరఫు లాయర్లు వాదించారు. దీంతో మాస్కులు, భౌతిక దూరం కనిపించడం లేదని కరోన నిబంధనలను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 3.16 శాతానికి చేరిందని వైద్యారోగ్య శాఖ హైకోర్టుకు వివరించింది. అయితే రాత్రి కర్ఫ్యూ వంటి ఆంక్షలు అమలు చేసే పరిస్థితులు ప్రస్తుతానికి లేవని వివరించింది. ఇంటింటి సర్వేలో మూడు రోజుల్లోనే లక్ష 78 వేల మంది జ్వర బాధితులను గుర్తించి మెడికల్ కిట్లు పంపిణీ చేసినట్లు నివేదించింది. ఐసియూ, ఆక్సిజన్ పడకల ఆక్యుపెన్సీ 6.1 శాతంగా ఉందని ముందు జాగ్రత్తగా జనం గుమిగూడకుండా ఈనెల 31 వరకు ఆంక్షలు విధించినట్టు డిహెచ్ శ్రీనివాసరావు హైకోర్టుకు తెలిపారు. వారం రోజులుగా రోజుకు లక్షకు పైగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు.

18 ఏళ్లలోపు వారిలో 59 శాతం మందికి టీకాలు ఇచ్చామని డిహెచ్ వివరించారు. రాష్ట్రంలో 2.16 లక్షల మందికి ప్రికాషన్ డోసు పూర్తైందని స్పష్టం చేశారు. ఇదిలావుండగా రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ప్రభుత్వం తప్పుడు గణాంకాలు ఇస్తోందని పిటిషనర్లు వాదించారు. 3 రోజుల్లోనే 1.70 లక్షల జ్వర బాధితులను గుర్తించినట్లు పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. రాష్ట్రంలో కరోనా తీవ్రతకు ఇదే నిదర్శనమని చెప్పారు. ప్రభుత్వం ఇస్తున్న కరోనా కిట్‌లో పిల్లలకు అవసరమైన మందులు లేవని న్యాయస్థానానికి వివరించారు. కాగా రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ప్రభుత్వం ఎప్పటికప్పు సమీక్ష నిర్వహించి చర్యలు తీసుకుంటోందని ఎజి హైకోర్టుకు తెలిపారు. మాస్కుల ధారణ, భౌతికదూరం పాటించడం అమలు కాకపోవడం దురదృష్టకరమని హైకోర్టు పేర్కొంది. కొవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. జిహెచ్‌ఎంసి, పోలీసులు కరోనా నిబంధనలు పకడ్బందీగా అమలయ్యేలా చూడాలని చెప్పింది. పరిస్థితి వివరించేందుకు తదుపరి విచారణకు డిహెచ్ హాజరు కావాలని ఆదేశించింది. కరోనా పరిస్థితిపై విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.

పాజిటివిటి 10దాటితే కర్ఫ్యూ అవసరం 

రాష్ట్రంలో కరోన పాజిటివిటీ రేటు 3.16 శాతంగా ఉందని, ప్రస్తుతం రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ వంటి ఆంక్షలు విధించే పరిస్థితులు లేవని, పాజిటివిటీ 10 శాతం దాటితే రాత్రి కర్ఫ్యూ వంటి ఆంక్షలు అవసరమని డిహెచ్ పేర్కొన్నారు. గత వారంలో ఒక్క జిల్లాలోనూ పాజిటివిటీ రేటు 10శాతం లేదన్నారు. మెదక్‌లో అత్యధికంగా 6.45, జిహెచ్‌ఎంసీసి 4.26, మేడ్చల్‌లో 4.22 శాతం పాజిటివిటీ ఉందని వివరించారు. ఐసియూ, ఆక్సిజన్ పడకల ఆక్యుపెన్సీ 6.1శాతంగా ఉందని, ముందు జాగ్రత్త చర్యగా ఈనెల 31 వరకు ఆంక్షలు పొడిగించినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి ఫీవర్ సర్వే జరుగుతోందని డిహెచ్ శ్రీనివాసరావు నివేదికలో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News