25న సిఎం కెసిఆర్ చేతుల మీదుగా పోర్టల్ ప్రారంభం : సిఎఎస్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో త్వరలోనే ప్రారంభం కాబోయే ధరణి పోర్టల్ పూర్తి పారదర్శకంగా, భద్రతా ప్రమాణాలతో ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. ఈ నెల 25న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు పోర్టల్ను ప్రారంభిస్తారన్నారు. ధరణి పోర్టల్ దేశంలోనే విప్లవాత్మకంగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదొక ట్రెండ్సెట్టర్గా నిలుస్తుందన్నారు. ఈ నేపథ్యంలో పోర్టల్ నిర్వహణకు అవసరమైన సదుపాయాలు కల్పించి వందశాతం అధికారులు సిద్ధంగా ఉండాలని ఆయన ఆదేశించారు.
శనివారం పోర్టల్ సన్నద్ధతపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష సిఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో తహసీల్దార్లతో పాటు డిప్యూటీ తహసీల్దార్లు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోమేశ్కుమార్ ధరణిపై సమగ్రంగా ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం సిఎస్ మాట్లాడుతూ, ధరణి పోర్టల్ చాలా వినూత్నమైందన్నారు. ఈ పోర్టల్ ద్వారా పూర్తి పారదర్శకత, జవాబుదారీతనం, సురక్షితమన్నారు. దేశంలోనే ఇలాంటి ప్రయోగం విప్లవాత్మకమైనదని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి దృష్టిలో ధరణిపోర్టల్ అన్నది పూర్తి పారదర్శకమని, ఎలాంటి అవకతవకలు ఉన్నా వాటిని తొలగిస్తారని సిఎస్ తెలిపారు.
రాష్ట్రంలోని 570 మండలాల్లోని తహసీల్దార్లు జాయింట్ సబ్ రిజిస్ట్రార్లుగా పని చేస్తారని, సబ్ రిజిస్ట్రార్ అధికారులు 142 ప్రదేశాల నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేస్తారని సిఎస్ వెల్లడించారు. తహసీల్దార్లు ఆదివారం నాటి కల్లా కనీసం పది లావాదేవీలను ప్రయోగాత్మకంగా పూర్తి చేయాలని సోమేశ్ కుమార్ సూచించారు. ధరణి సేవలకు ఎలాంటి అంతరాయం కలుగకుండా చూసేందుకు డిస్కమ్, బ్రాడ్బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్లు, టిఎస్ టిఎస్ ప్రతినిధులతో క్రమం తప్పకుండా సమన్వయ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ ఐజి శేషాద్రి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి రిజ్వీ, ఎస్సి అభివృద్ధిశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టియానా, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ నీతు ప్రసాద్, ఫైనాన్స్ ప్రత్యేక కార్యదర్శి రోనాల్ రాస్, పిఆర్ఆర్ అండ్ ఆర్డి కమిషనర్ రఘునందన్ రావు, ఎక్సైజ్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, టిఎస్టిఎస్ ఎండి వెంకటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.