లండన్ : కరోనా దెబ్బకు టెన్నిస్తో సహా అన్ని క్రీడల షెడ్యూల్ అస్తవ్యస్తమైన విషయం తెలిసిందే. కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య ఇటీవలే టోర్నమెంట్ల క్యాలెండర్ను రీషెడ్యూల్ చేసింది. ఆగస్టు 24 నుంచి జరిగే యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నమెంట్తో టెన్నిస్ పోటీలకు తెరలేవనుంది. అయేతి ఎటిపి ప్రకటించిన రీషెడ్యూల్పై స్టార్ ఆటగాళ్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొత్త ఆటగాళ్లకు ఇబ్బందిగా మారింది. సెప్టెంబర్ 13 వరకు యూఎస్ ఓపెన్ జరగనుంది. అది ముగిసిన 15 రోజుల తర్వాత క్లే కోర్టులపై ఫ్రెంచ్ ఓపెన్ జరుగుతుంది. అప్పటి వరకు గ్రాస్ కోర్టులపై ఆడిన ఆటగాళ్లకు మట్టి కోర్టుల్లో జరిగే ఫ్రెంచ్ ఓపెన్లో ఆడడం ఇబ్బందిగా మారడం ఖాయం. ఇక యూఎస్ ఓపెన్ ముగిసిన వెంటనే రెండు మాస్టర్స్ టెన్నిస్ టోర్నీలు జరుగనున్నాయి.
ఫ్రెంచ్ ఓపెన్కు ముందు ఉన్న 15 రోజుల ఖాళీ సమయంలో మాడ్రిడ్, రోమ్లలోఈ టోర్నీలు జరుగుతాయి. ఇలా ఆరు వారాల స్వల్ప వ్యవధిలో నాలుగు ప్రధాన టోర్నీల్లో ఆడాల్సి రావడం ఆటగాళ్లకు సమస్యగా మారింది. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం ఆటగాళ్లలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇలాంటి సమయంలో ఏమాత్రం ముందు చూపులేకుండా షెడ్యూల్ను ప్రకటించడంపై పలువురు స్టార్ ఆటగాళ్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ నంబర్2 ఆటగాడు రఫెల్ నాదల్, జర్మనీ స్టార్ జ్వరేవ్, ఆస్ట్రియా ఆటగాడు డొమినిక్ థిమ్, మహిళా క్రీడాకారిణిలు సిమోనా హలెప్, క్విటోవా, ప్లిస్కోవా, ముగురుజా తదితరులు కూడా ఎటిపి ప్రకటించిన రీషెడ్యూల్పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. నాలుగు ప్రధాన టోర్నీల మధ్య కనీస విరామం లేకుండా షెడ్యూల్ను ప్రకటించడాన్ని వారు తప్పుపడుతున్నారు.
ఇది ఆటగాళ్లపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎటిపి రీషెడ్యూల్పై నాదల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎలాంటి ముందు చూపులేకుండా ఇలాంటి షెడ్యూల్ ప్రకటించడంపై ఫైర్ అయ్యాడు. ఇది ఆటగాళ్లను ఎంతో ఆవేదనకు గురిచేస్తుందని వాపోయాడు. నాదల్ అసంతృప్తిగా ఉన్న విషయాన్ని అతని కోచ్ టోనీ వెల్లడించాడు. ఇక బ్రిటన్ స్టార్ ఆండ్రీ ముర్రే కూడా రీషెడ్యూల్ను తప్పుపట్టాడు. ప్రస్తుత తరుణంలో టోర్నీల మధ్య కనీస విరామం ఉండాల్సిన అవసరం ఎంతైన ఉందన్నాడు. కరోనా తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెంటవెంటనే ప్రయాణించడం ఆటగాళ్లకు అంత క్షేమం కాదని అభిప్రాయపడ్డాడు. ఇప్పటికైన షెడ్యూల్పై టెన్నిస్ సమాఖ్య పునరాలోచన చేయాలని ముర్రే సూచించాడు.