Saturday, April 20, 2024

రావణుడిలా మోడీకి పది తలలున్నాయా ?: మల్లికార్జున్ ఖర్గే

- Advertisement -
- Advertisement -

 

అహ్మదాబాద్ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ప్రధాని నరేంద్రమోడీపై మరోసారి విరుచుకుపడ్డారు. బెహ్రంపురలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఖర్గే మోడీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కార్పొరేషన్ ఎన్నికలైనా, ఎంపీ, ఎమ్‌ఎల్‌ఎ ఎన్నికలైనా అన్ని ఎన్నికల్లో మోడీ ముఖం కనిపిస్తోందన్న ఖర్గే … మోడీజీ మీకు రావణుడిలా పది తలలున్నాయా ? అని ప్రశ్నించారు. మున్సిపల్, కార్పొరేషన్, అసెంబ్లీ ఏ ఎన్నికలైనా మోడీ పేరుతో ఓట్లు అడుగుతున్నారని , అభ్యర్థి పేరుతో ఓట్లు అడగండని హితవు పలికారు.

మోడీ వచ్చి మున్సిపాలిటీలో పనులు చేసి పెడతారా అని ఖర్గే నిలదీశారు. మీకు ఎలాంటి ఇబ్బంది కలిగినా , అవసరం వచ్చినా, మోడీ సాయం చేస్తారా ? అని ప్రశ్నించారు. మరోవైపు ప్రధాని మోడీ పై గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఖర్గే పదునైన వ్యాఖ్యలు చేస్తూ ఓటర్లను ఆలోచనలో పడేస్తున్నారు. ప్రధాని ఓటర్ల సానుభూతి పొందేందుకు తాను పేదవాడినని పదేపదే చెబుతున్నారని, ఆయన అసత్యాలు ప్రచారం చేస్తూ ఓట్ల వేట సాగిస్తున్నారని ,ఇటీవల ఓ ర్యాలీలో ఖర్గే విమర్శించారు. ఇక ప్రధాని మోడీని ఖర్గే రావణుడితో పోల్చడం పట్ల కమలనాథులు మండిపడుతున్నారు. గుజరాత్‌లో ప్రజాసమస్యల మీద పోరాడటం చేతకాని కాంగ్రెస్ సహనం కోల్పోయి, ప్రధానిపై చవకబారు విమర్శలు చేస్తోందని బీజేపీ ఐటి సెల్ చీఫ్ అమిత్ మాలవీయ ధ్వజమెత్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News