న్యూఢిల్లీ : కరోనా నియంత్రణ చర్యలలో భాగంగా బుధవారం నుంచి దేశంలో వివిధ ప్రాంతాల మధ్య నడిచే విమానాలను రద్దు చేస్తున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సోమవారం నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ విమాన ప్రయాణాలను ఇప్పటికే వారం రోజుల పాటు నిలిపివేశారు. దేశీయ విమాన సర్వీసులన్నీ కూడా మంగళవారం రాత్రి 11.59లోగా తమ గమ్యస్థానాలకు చేరాల్సి ఉంటుంది. కేవలం సరుకు రవాణా విమానాలకు అనుమతి ఉంటుంది. దేశంలో కరోనా మృతుల సంఖ్య సోమవారం 8కు చేరుకుంది. కరోనా సోకిన వారి సంఖ్య 415గా నమోదైంది. ప్రజల రాకపోకలను నియంత్రించేందుకు చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇచ్చేందుకు విమాన ప్రయాణాలు అన్నీ బంద్ అయ్యాయి.
దేశ రాజధానికి విమానాలెవీ అనుమతించేది లేదని ఆదివారం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చెప్పారు. అయితే మంగళవారం రాత్రివరకూ దేశీయ విమానాలు వస్తాయని, తరువాత వీటిని నిలిపివేస్తారని పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ ఒక ప్రకటన వెలువరించింది. ఇక బెంగాల్లోకి విమానాలను నిలిపివేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. రాష్ట్రంలో బస్సులు, రైళ్లు నిలిపివేశారని, అయితే ఇతర ప్రాంతాల నుంచి విమానాలు వస్తూనే ఉన్నాయని , దీనితో అసలు క్వారంటైన్ ఉద్ధేశమే నెరవేరదని ముఖ్యమంత్రి తెలిపారు.