అట్లాంటా: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో ఏదో విధంగా తప్పులు చూపి వాటిని వెలుగులోకి తేవాలని ట్రంప్ యత్నించారు. ఈ విషయం జార్జియా ఎన్నికల ప్రక్రియ విషయంలో స్పష్టం అయింది. ఓ మెట్రో అట్లాంటా కౌంటీలో ఓటర్ల బ్యాలెట్ల నిర్థారణ దశలో ట్రంప్ నుంచి అధికారులు ఒత్తిడిని ఎదుర్కొన్నారని వెల్లడైంది. ఎన్నికలలో అక్రమాలు జరిగాయనే ట్రంప్ ఫిర్యాదుల మేరకు నిజనిర్థారణకు దర్యాప్తు అధికారులు ఏర్పాటు అయ్యారు. బ్యాలెట్ పత్రాలు, ప్రత్యేకించి ఎన్నికల్లో ఓటేయని వారి సంతకాల నిర్థారణ దశలో తప్పులను చూపాలని అధికారులపై ట్రంప్ ఒత్తిడి తీసుకువచ్చారు.
ఈ సారి ఎన్నికలలో పలు అక్రమాలు జరిగాయని పేర్కొంటూ వచ్చిన ట్రంప్ న్యాయస్థానాలలో కానీ బయట కానీ దీనికి సంబంధించి ఎటువంటి ఆధారాలు చూపలేకపొయ్యారు. అయితే ఏదో విధంగా అక్రమాలు జరిగినట్లు ఒక్క సాక్షం లేదా అధికారుల ధృవీకరణ జరగాలని, ఈ విధంగా చేసిన వారు నిజంగా దేశ భక్తులు, జాతీయ హీరోలుగా నిలుస్తారని ట్రంప్ వారికి నచ్చచెప్పినట్లు ఇప్పుడు సంబంధిత అధికారుల నుంచి వెల్లడి అయింది. ఈ నెల 2వ తేదీన ట్రంప్ జార్జియా సెక్రెటరీ బ్రాడ్ రఫెన్స్పెర్గెర్కు ఫోన్ చేసినట్లు, తప్పులు వెతకండి, మిగతాది తాను చూసుకంటానని చెప్పినట్లు వెల్లడైంది. ఈ ఫోన్కాల్ విషయం గురించి ఇప్పుడు వాషింగ్టన్ పోస్టు పత్రిక ప్రముఖంగా ప్రచురించింది.