కరోనా రిలీఫ్ ఫండ్… భారీగా విరాళాలు
సత్యనాదెళ్ల సతీమణి రూ.2 కోట్లు
ఉద్యోగ సంఘాల జెఎసి ఒక రోజు వేతనం 48 కోట్లు
హీరో నితిన్ రూ.10 లక్షలు
డెయిరీ కార్పొరేషన్ చైర్మన్ రూ.5లక్షలు
బండి సంజయ్ ఎంపి ల్యాడ్స్ నుంచి రూ. 50 లక్షలు
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తుగా తీసుకుంటున్న జనతా కర్ఫూ, లాక్ డౌన్ చర్యలకు పలువురు తమవంతు నిధులను అందించి ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు. కరోనా వైరస్ నివారణ చర్యలకు మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్యనాదేళ్ళ సతీమణి భారీ విరాళం ప్రకటించారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి సత్యనాదేళ్ళ సతీమణి అనుపమ రూ. 2 కోట్లు విరాళంగా అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ను అనుపమ తండ్రి విశ్రాంత ఐఎఎస్ కెఆర్ వేణుగోపాల్ కలిసి చెక్ను అందజేశారు. ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కెసిఆర్ను కలిసిన తెలుగు చలన చిత్ర నటుడు నితిన్ రూ. 10 లక్షల చెక్ను అందించారు. తాజాగా సిఎం కెసిఆర్ను ఉద్యోగ సంఘాల జెఎసి ప్రతినిధులు కలిశారు. కోవిడ్ 19ను అరికట్టేందుకు తమ ఒక రోజు మూల వేతనాన్ని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు విరాళంగా అం దించారు.
కరోనా నియంత్రణకు సిఎం సహాయనిధికి వారు రూ. 48 కోట్లు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ను కలిసి జెఎసి నాయకులు రవీందర్రెడ్డి, మమత చెక్ను అందించారు. కరీంనగర్ ఎంపి బండి సంజయ్ తన ఎంపి నియోజకవర్గం పరిధిలో కరోనాను అరికట్టేందుకు ఎంపి ల్యాడ్స్ నిధుల నుం చి రూ. 50 లక్షల చెక్కును జిల్లా కలెక్టర్కు అందజేశారు. కరోనా వ్యాప్తిచెందకుండా, లాక్డౌన్ సందర్భంగా పేదల నిత్యావసర సరుకుల సరఫరా కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలకు డెయిరీ కార్పోరేషన్ చైర్మన్ లోకా భూమారెడ్డి రూ. 5 లక్షల విరాళాన్ని ప్రకటించారు.
సహాయ నిధికి పిఆర్టియు ఒక రోజు వేతనం
పిఆర్టియు సంఘం సభ్యులందరూ మార్చి నెలలో ఒక రోజు వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి(సిఎంఆర్ఎఫ్)కు విరాళం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం ప్రగతిభవన్లో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్రావులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావును కలిసి ఒక రోజు వేతనానికి సంబంధించిన అంగీకార పత్రాన్ని అందజేశారు. అలాగే పంచాయతీరాజ్ టీచర్స్ యూనియన్ సభ్యులు సిఎంఆర్ఎఫ్కు రూ.16 కోట్లు, ఎంఎల్సి కూర్మయ్యగారి నవీన్కుమార్ రూ.10 లక్షల ప్రకటించారు. ఎంఎల్ఎ పైలేట్ రోహిత్ రెడ్డి తన ఒక నెల వేతనం రూ.2.50లక్షలు సిఎంకు చెక్ను అందజేశారు.