సిద్దిపేట: ఓటర్లలో చైతన్యం పెరగడంతో స్వచ్ఛందంగా వచ్చి తమ ఓటును వినియోగించుకున్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ అన్నారు. దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా మంగళవారం ఆయన దుబ్బాక, లచ్చపేటలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించి మాట్లాడారు. అధికారులు నిర్భయంగా ఓటు వేయాలని ప్రజలను ఎంతో చైతన్య పరిచారని అభినందించారు. ప్రజల నుంచి మంచి స్పందన లభించడంతో పోలింగ్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున బారులు తీరి ఓటు హక్కును వినియోగించుకున్నారని అన్నారు. ఎన్నికల సంఘం దుబ్బాక ఉప ఎన్నికలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునేందుకు వృద్ధులకు, వికలాంగులకు, కోవిడ్ బాధితులకు అవకాశం కల్పించిందని అన్నారు.
దీంతో పోస్టల్ బ్యాలెట్ ద్వారా చాలా మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని అన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద కోవిడ్ నిబంధనల ప్రకారం శానిటైజర్, మాస్కులు, గ్లౌజులను ఏర్పాటు చేశామన్నారు. ఓటర్లు సైతం భౌతికదూరం పాటించి అధికారులకు సహకరించారని అన్నారు. అక్కడక్కడ కొన్ని చోట్లలో మాత్రమే ఈవీఎంలు మోరాయించాయని.. వాటిని సరిచేసి వెంటనే వినియోగంలోకి తెచ్చామని అన్నారు. ఆయన వెంట జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భారతీ హోళికెరి, సిపి జోయల్ డెవిస్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.