హైదరాబాద్ : ఇంజనీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్ దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 21వ తేదీ(శుక్రవారం) నుంచి ప్రారంభం కానుంది. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా మార్చి 30 వరకు ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరిస్తారు. రూ.500 అపరాధ రుసుముతో ఏప్రిల్ 6వ తేదీ వరకు, రూ.వెయ్యి అపరాధ రుసుంతో ఏప్రిల్ 13వ తేదీ వరకు, రూ.5వేల అపరాధ రుసుంతో ఏప్రిల్ 20 తేదీ వరకు, రూ.10వేల జరిమానాతో ఏప్రిల్ 27వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. మార్చి 31వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 20వ తేదీ నుంచి మే 1వ తేదీ వరకు హాల్టికెట్లు డౌన్లోడ్కు అవకాశం కల్పించనున్నారు. ఎంసెట్ ప్రవేశ పరీక్ష ఫీజుల్లో ఈ సారి కొత్తగా వికలాంగులకు 50 శాతం రాయితీ ఇచ్చారు.
మిగతా కేటగిరీలకు చెందిన వారి ఫీజుల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. యథాతదంగా గత ఏడాది ఫీజులనే కొనసాగించారు. ఎంసెట్ ఇంజనీరింగ్కు ఎస్సి,ఎస్టి,వికలాంగులకు రూ.400, ఇతరులకు రూ.800 ఫీజు ఉంటుంది. అగ్రికల్చర్ కోర్సులకు కూడా ఎస్సి,ఎస్టి,వికలాంగులకు రూ.400, ఇతరులకు రూ.800 ఫీజు ఉంటుంది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్ కోర్సులు రెండింటికీ పరీక్షలు రాసే విద్యార్థులకు ఎస్సి,ఎస్టి,వికలాంగులకు రూ.800, ఇతరులకు రూ.1,600 ఫీజు చెల్లించాలి. మే 4,5,7,8వ తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్, మే 9,11వ తేదీల్లో అగ్రికల్చర్ పరీక్షలు జరగనున్నాయి.