మన తెలంగాణ/హైదరాబాద్: ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కోసం కేంద్రం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోనూ 2021 జనవరి ఒకటి అర్హత తేదీతో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం చేపట్టనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ నెలఖారు వరకు ప్రీరివిజన్ కార్యక్రమం చేపడుతారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ, డూబ్లికేట్ ఓట్ల తొలగింపు, పోలింగ్ కేంద్రాల తొలగింపు, మార్పులు, చేర్పులు ఇందులో ఉంటాయి. నవంబర్ 16వ తేదీన ఓటర్ల జాబితా ముసాయిదాను విడుదల చేస్తారు. ఆ రోజు నుంచి డిసెంబర్ 12వ తేదీ వరకు అభ్యంతరాలు, వినతుల స్వీకరణ ఉండనుంది. ఇందుకోసం పోలింగ్ బూత్ల వద్ద అధికారులు, సిబ్బంది అందరికీ అందుబాటులో ఉండేలా నెలలో రెండు శని, ఆదివారాలు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతారు. 2021 జనవరి 15వ తేదీన ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తారు. 2021 జనవరి నాటికి 18 ఏళ్ల వయస్సున్న వారు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. WWW.NVSP.IN వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లోనూ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
ECI to Release Schedule for Voter list Revision