Thursday, April 25, 2024

ఇడి ముందు రెండో రోజూ హాజరైన నటి జాక్వెలైన్ ఫెర్నాండెజ్

- Advertisement -
- Advertisement -

ED grills Jacqueline Fernandez for 2nd consecutive day

న్యూఢిల్లీ: మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్, ఇతరులు పాల్పడిన మనీలాండరింగ్ కేసులో నటి జాక్వెలైన్ ఫెర్నాండెజ్(36) గురువారం వరుసగా రెండో రోజూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) ముందు హాజరైంది. ఆమె ఇడి కార్యాలయంలో ఎనిమిది గంటలు వెచ్చించారు. మనీలాండరింగ్ కేసులో బుధవారం ఆమెను ప్రశ్నించి రికార్డు నమోదుచేసుకున్నారు. రెండో రోజూ గురువారం కూడా ఆమెను ప్రశ్నించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది ఇంతకు మునుపు రెండుసార్లు కూడా ఆమెను ప్రశ్నించడం జరిగింది. చంద్రశేఖర్ మోసంతో సంపాదించిన డబ్బుతో ఆమె ప్రయోజనం పొందిందని ఇడి అనుమానిస్తోంది. ఆమెతోపాటు ఆమె సహచరురాలిని కూడా ప్రశ్నించారు. “నటి జాక్వెలైన్ ఓ సాక్షిగానే ఇడి ముందు వాంగ్మూలం ఇచ్చారు” అని ఆమె ప్రతినిధి తెలిపారు. ఇదిలావుండగా చంద్రశేఖర్ దంపతులతో తనకు సంబంధాలున్నాయని తప్పుడుగా ప్రచారం అవుతున్న విషయాన్ని జాక్వెలైన్ ఖండించారు.

జాక్వెలైన్‌ను డిసెంబర్ 5న ముంబయి విమానాశ్రయంలో విదేశాలకు వెళ్ళకుండా ఇడి అడ్డుకున్నదన్న సంగతి తెలిసిందే. దర్యాప్తులో పాలుపంచుకునేందుకు ఆమె దేశంలోనే ఉండాలని కూడా ఆదేశించింది. రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఆమెను ఇడి అనేకసార్లు ప్రశ్నించింది. మరో బాలీవుడ్ నటి,డ్యాన్సర్ నోదా ఫతేహిని కూడా ఇడి ప్రశ్నించింది. ఈ కేసులో ఇడి చంద్రశేఖర్ దంపతులను, మరో ఇద్దరు నిందితులు ప్రదీప్ రమనానీ, దీపక్ రమనానీ కూడా అరెస్టు చేసింది. చెన్నైలో చంద్రశేఖర్ ఇంటిలో రూ. 82.5 లక్షల రొక్కం, డజన్ల కొద్దీ లగ్జరీ కార్లను ఇడి జప్తు చేసింది. అతడు తన 17వ ఏట నుంచే నేర సామ్రాజ్యంలో ఉన్నట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. అతడు ఒకసారి జైలుకు వెళ్లి వచ్చినప్పటికీ ప్రజలను మోసగించడం మానుకోలేదని తెలుస్తోంది. అతడు ఫోర్టిస్ హెల్త్‌కేర్ మాజీ ప్రమోటర్ శివిందర్ మోహన్ సింగ్, ఆయన భార్య అదితి సింగ్‌లను మోసగించాడు కూడా. అతడు ప్రస్తుతం రోహినీ జైలులో ఉన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News